ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం విజయకేతనం ఎగురవేసింది. వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి పంపించింది. తెలుగుదేశంతోపాటు బరిలోకి దిగిన జనసేన బిజెపికి కూడా మంచి ఫలితాలు దక్కాయి. జనసేన బిజెపి పోటీ చేసిన అన్ని స్థానాలు గెలుచుకోవడం విశేషం. గత వైసీపీ సీట్ల కన్నా తెలుగుదేశానికి ఎక్కువ సీట్లు రావడం విశేషం.
ఎన్నికల హామీలో భాగంగా కూటమి మ్యానిఫెస్టోలో పొందుపర్చిన సూపర్ సిక్స్ స్కీం బాగా వర్కవుట్ అయిందని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా మహిళలకు నెలకు 1500 రూపాయల సహాయం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అమ్మ ఒడి కింద 15 వేల రూపాయల సహాయం కలిసి వచ్చాయి. అలాగే రైతులకు ఏడాదికి 20 వేల రూపాయల ఆర్థిక సాయం చేయాలన్న ప్రతిపాదన ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో 175 సీట్లకు గాను 151 స్థానాలు గెలుచుకున్న వైసీపీ 2024 ఎన్నికల్లో కేవలం 10 స్థానాల్లోపే చాప చుట్టేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇందులో ప్రధాన కారణం ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని చెప్పుకోవాలి. పార్టీ క్యాడర్ను కానీ నాయకులను గాని ఏమాత్రం పట్టించుకోకుండా తాడేపల్లి ప్యాలెస్ లో భజన బృందం మధ్యలో మునిగిపోయారు అనేది సుస్పష్టం. పంచాయతీ నిధుల్ని నిర్వీర్యం చేసి సర్పంచులు సొసైటీ అధ్యక్షుల్ని మరబొమ్మలుగా మార్చేశారు. ఇంకా చెప్పాలంటే గ్రామాల్లో వైసీపీ క్యాడర్ ని స్వయంగా వైయస్ జగన్ నాశనం చేసుకున్నారు. దీనికి తోడు ఎమ్మెల్యేల మీద అనుమానంతో ఢిల్లీ నుంచి వచ్చిన స్ట్రాటజీ టీం కి బాధ్యతలు కట్టబెట్టారు. దీంతో పార్టీలో నాయకులు కార్యకర్తలు నిరాశలో మునిగిపోయి చేతులు ఎత్తేసారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే పోలీసులను అడ్డం పెట్టుకుని పరిపాలన చేయడం వైసిపికి చావు దెబ్బ అని అనుకోవాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పిన ప్రతి వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఒక్క అమలాపురం అనే పట్టణంలో గొడవలు జరిగిన పాపానికి ఎనిమిది వందల మంది మీద కేసులు పెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొన్నిచోట్ల 70 ఏళ్ళు దాటిన ముసలి వాళ్ళ మీద రేప్ కేసులు పెట్టారు. మరి కొన్ని చోట్ల ఎస్సీల మీద ఎస్సీ వేధింపులు కేసులు పెట్టారు. దీనిని బట్టి వేధింపులు ఏ స్థాయిలో జరిగాయి అర్థం అవుతుంది పోలీసుల్ని అడ్డం పెట్టుకొని పాలించిన ఏ ప్రభుత్వం అయినా కుప్పకూలడం అనేది అక్షర సత్యం. ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు మాత్రమే కాకుండా కనిపించిన వాళ్ళందరి మీద కేసులు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. దీంతో ప్రజలకు కోపం నషాలానికి అంటింది అందుకే సర్వేల్లో కూడా బయటపడకుండా చిత్తుచిత్తుగా వైసీపీని ఓడించి పంపించారు. దీనికి ఉదాహరణ తెలుగుదేశం పార్టీకి దక్కిన భారీ మెజారిటీలు.
రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా రాజధాని విషయంలో గందరగోళంగా ఉంది. మూడు రాజధానులు పేరుతో చేసిన గందరగోళం రియల్ ఎస్టేట్ ను దివాలా తీయించింది. ఏపీలో భూముల రేట్లు అన్ని పూర్తిగా అడుగంటిపోయాయి . టిడిపి నాయకుల మీద ఉన్న కోపంతో ఇసుక రవాణాకు అడ్డుకోవడంతో నిర్మాణరంగం కుదిలైపోయింది. దీంతో తాపీ మేస్త్రీలు కూలీలు పనులు లేక అల్లాడిపోయారు.
ఐదేళ్ల ప్రభుత్వ పరిపాలనలో ఐదు కూడా పరిశ్రమలు రాలేదంటే అతిశయోక్తి కాదు. ఆశించిన మేర ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించడంలో విఫలం అయ్యారు . చంద్రబాబుకి అధికారం ఇచ్చి ఉంటే పరిశ్రమలు తెచ్చేవారని ఉద్యోగాలు ఇప్పించే వారన్న వాదన ఊపొందు కొంది. ఈ విషయంలో జగన్ ప్రభుత్వం అట్టర్ ఫెయిల్ అయిందనటంలో అనుమానమే లేదు.
ప్రత్యేకించి రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ వంటి వాళ్ల దురుసు ప్రవర్తన వైసిపి మీద అసహ్యం పుట్టించాయి. మంత్రులుగా చేయాల్సిన పనులు గాలికి వదిలేసి బూతులు తిట్టడమే పనిగా ఈ నాయకులు ప్రవర్తించారు. ఇటువంటి పోకడలను ప్రజలు పూర్తిగా అసహ్యించుకున్నారు.
కేవలం సంక్షేమ పథకాలపైనే దృష్టి కేంద్రీకరించారన్న మాట వాస్తవం. కనీసం రోడ్ల మరమ్మతులు కూడా చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం గమనించాల్సిన విషయం.
దురుసుగా మాట్లాడటం, నిర్లక్ష్యపు వైఖరి, జవాబుదారీతనం లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రజలు నమ్మి అధికారం ఇచ్చినప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా కుట్రలు, కుతంత్రాలు, పగలు, ప్రతీకారాలు, హింస, రివెంజ్ వంటి అంశాలపై ఫోకస్ చేయటం వైసిపి కొంపముంచాయి.
మొత్తానికి ఒక మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ భారీ విజయానికి కర్త కర్మ క్రియ అన్ని వైయస్ జగన్ అని చెప్పుకోవాలి అందుచేత థాంక్స్ టు జగన్ను అనుకుంటూ టిడిపి కూటమి పరిపాలన మొదలు పెట్టవచ్చు.