ఆఫ్గనిస్తాన్ ప్రజలను ఆదుకునేందుకు గోధుమలు పంపిన భారత ప్రభుత్వానికి ప్రత్యేకధన్యవాదాలు తెలిపారు తాలిబన్ అధికారులు. అదేసమయంలో పాకిస్తాన్ అందజేసిన గోధుమలు నాసిరకంగా ఉన్నాయని, కనీసం తినేందుకు పనికిరావని తాలిబన్ అధికారులు చేసిన ట్వీట్ వైరల్ అవుతోందిప్పుడు.
గత నెలలో భారత్ మానవతా సాయంగా ఆఫ్గన్ ప్రజలకోసం గోధుమలు పంపింది. ఆ ట్రక్కులు పాక్ భూభాగం నుంచే వెళ్లాయి. అ సమయంలో ఆ ట్రక్కులమీద ఉన్న బ్యానర్లను తొలగించింది పాకిస్తాన్. అదేసమయంలో పాకిస్తాన్ కూడా గోధుమలు పంపింది. అయితే పాక్ పంపిన గోధుమలు అస్సలు బాగాలేవంటూ ఆఫ్గన్ అధికారి ట్వీట్ చేయడంతో మాటల యుద్ధం మొదలైంది. భారత్ పంపిన గోధుమలు నాణ్యతను ప్రశంసిస్తూ…నాణ్యతలేని గోధుమలు పంపినందుకు పాకిస్తాన్ ను నిందిస్తున్నట్టు ఆ ట్వీట్ ఉంది. అందుకు సంబంధించి పాక్ పంపిన గోధుమల వీడియోను ట్వీట్ కు జతచేశారు.
https://twitter.com/MusaAhmadzai7/status/1500030065240907777?s=20&t=KItbGoQ34ffvMe7B1QY-aA
ఆఫ్గన్ ప్రజలకు నిరంతరం మద్దతుగా ఉంటున్న భారత్ కు ప్రత్యేక ధన్యవాదాలు. మంచి నాణ్యమైన గోధుమలు పంపారు. మీతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తాం. జైహింద్ అంటూ ట్వీట్ చేశారు. ఆ వీడియోను పోస్టు చేస్తూ ఆఫ్గన్ జర్నలిస్ట్ అబ్దుల్లా ఒమెరి కూడా ట్వీట్ చేశారు. “పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కు విరాళంగా ఇచ్చిన గోధుమలు పాడైపోయాయి. వాడడానికి వీల్లేకుండా ఉన్నాయి. భారత్ ఎల్లప్పుడూ ఆఫ్గనిస్తాన్ కు సాయం చేస్తూనే ఉంది ఆయన ట్వీట్ చేశారు.
గతనెలలో 2 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను సాయంగా అందజేసింది భారత్. తరువాత రెండు రోజుల క్రితం అమృత్ సర్ అత్తారి నుంచి జలాలాబాద్ కు మరికొన్నిగోధుమలు పంపినట్టు విదేశీమంత్రిత్వశాఖ తెలిపింది. మొత్తం 50వేల మెట్రిక్ టన్నుల గోధుమల్ని యునైటెడ్ నేషన్స్ వాల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కింద పంపింది భారత్.
ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతో ప్రత్యేక సంబంధాలకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. మొదటివిడతలో అమృత్ సర్ నుంచి వెళ్తున్న ట్రక్కులను జెండా ఊపి పంపారు విదేశాంగకార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా. మానవతాసాయంగా పంపుతున్న గోధుమ ట్రక్కులపై ఆఫ్గన్ కు భారత్ బహుమతి అని అర్థం వచ్చేలా ఉన్న బ్యానర్లను పాకిస్తాన్ తొలగించింది.