జమ్మూ కశ్మీర్లోని బుద్గావ్ జిల్లాలో ఉగ్రవాదులు మళ్లీదాడికి తెగబడ్డారు. నటి, గాయని అమ్రీనా భట్ను లష్కర్-ఇ-తోయిబా(LeT) ఉగ్రవాదులు కాల్చిచంపారు, ఆ దాడిలో ఆమె 10 ఏళ్ల మేనల్లుడు బుల్లెట్ గాయాలయ్యాయి. సెంట్రల్ కశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలోని చదూరా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అమ్రీనా భట్, ఆమె మేనల్లుడు ఫర్హాన్పై బుధవారం సాయంత్రం కోంగోయిపోరా-హుష్రూలోని వారి ఇంటిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే వారిద్దరినీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అమ్రీనా మృతి చెందింది.
అమ్రీనా భట్పై రాత్రి 7:55 గంటలకు దాడి జరిగిందని.. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఎల్ఈటీకి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఈ దారుణమైన ఉగ్రదాడిలో పాల్గొన్నారని కహస్మీర్ పోలీసులు ట్విట్టర్లో తెలిపారు.
https://twitter.com/KashmirPolice/status/1529490727108894720?s=20&t=A5gZDFVW7hho-0yMrYuTgQ
చేతికి బుల్లెట్ గాయంతో బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. చాదూరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంఘటన తర్వాత అమ్రీనాను చదూరా ఆసుపత్రికి తీసుకెళ్లారు, ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీనగర్లోని SMHS ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది. ఆమె చనిపోయిందని SMHS హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కన్వల్జీత్ సింగ్ తెలిపారు.
మరోవైపు ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని చుట్టుముట్టి.. ఉగ్రవాదులను పట్టుకోవడానికి భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఘటనపై కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం దాడికి గల కారణాలు ఇంకా ఎలాంటి సమాచారం లేదు.