పాకిస్థాన్ ఇప్పటికీ భారత్ మీద కుట్రలు చేస్తోంది అనేందుకు మరో ఆధారం బయట పడింది. భారత దేశానికి వ్యతిరేకంగా అక్కడ ఉగ్రవాద సంస్థలు బహిరంగంగా ర్యాలీలు,ప్రదర్శనలు చేస్తున్నాయి. వీటిలో మంత్రులు, సైనికాధికారులు నిస్సిగ్గుగా పాల్గొంటున్నారు. దీనిని బట్టి పాక్ బుద్ది ఇంకా మారలేదని, ఎప్పటికీ మారదని మనకు అర్థం అవుతుంది.
రెండు రోజులుగా పాకిస్తాన్ లో ఉగ్రవాదులు అనేక ర్యాలీలు తీశారు. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీలాంటి నగరాలతో సహా మొత్తం 50 నగరాలలో భారత్కు వ్యతిరేకంగా ర్యాలీలను నిర్వహించినట్టు సమాచారం. దీనిలో పాక్ మర్కజీ ముస్లిం లీగ్ పార్టీ కూడా పాల్గొనడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పీఎంఎంఎల్ సమావేశాలు సమాఖ్య, పంజాబ్, సింధ్ ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగాయి. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఎక్కువ ర్యాలీలు జరిగినట్టు తెలుస్తోంది.
ఇక్కడే మరో విశేషం కూడా ఉంది. కరడు గట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ నిర్వహించిన ఈ ర్యాలీలలో పాక్ మంత్రులు, సైన్యం కూడా పాల్గొంటుంది. ఈ ర్యాలీల్లో ఉగ్రవాద నాయకుల ప్రసంగాలు, మంత్రుల మాటలు చూస్తుంటే పాకిస్తాన్ మరో దాడికి కుట్ర చేస్తోందని అనుమానం బలపడుతోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. తాజాగా మే 28వ తేదీన పంజాబ్ ప్రావిన్స్ లో భారత్ కు వ్యతిరేకంగా ఒక ర్యాలీ జరిగింది. ఇందులో ఆ దేశపు మంత్రులు, లష్కరే తోయిబా ఉగ్రవాదులు కలిసి వేదికను పంచుకున్నారు.
దీనికోసం ఒక వంక ఏర్పాటు చేసుకొన్నారు. పాకిస్తాన్ అణు పరీక్షలకు గుర్తుగా యూమ్-ఏ-తక్బీర్ కార్యక్రమంలో వీరంతా తమ భారత వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఇందులో ఖలిస్తాన్ ఉగ్రవాదులు కూడా పాల్గొంటున్నారు. వీరు భారత్ లో అశాంతిని రెచ్చగొట్టాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు. ఉగ్రవాది హఫీజ్ సయీద్ భారత్ లో మరో దాడికి కుట్ర చేస్తున్నాడని, దాని కోసమే ఇప్పుడు పాకిస్థాన్ ఆర్మీకి మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నాడని నిఘా వర్గాలు అంటున్నాయి.
మొత్తం మీద పాకిస్తాన్ లో ఉగ్రవాదులు, సైన్యం .. దొందూ దొందే అన్న వాదనకు ఆధారాలు లభించినట్లు అయింది.