యూపీలో పేరుమోసిన గ్యాంగ్ స్టర్ అతీక్ మహ్మద్ హత్య కలకలం రేపుతోంది.
మీడియా ప్రతినిధులుండగానే, కెమెరాలు చూస్తుండగానే అతీక్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్ ను కాల్చిచంపారు. మరి ఈ హత్యకూడా ఎన్ కౌంటరేనా? అయితే ప్రభుత్వానికేం సంబంధం లేదా? పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నాయని అతీఫ్ చెప్పడంవల్లే మట్టుబెట్టారా?
మిట్టీ మే మిలాదేంగే… అంటే మట్టిలో కలిపేస్తాం.. ఇదీ యూపీలో మాఫియా డాన్ లకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇచ్చిన వార్నింగ్. ఈ మాట అన్న కొన్ని రోజులకే అతీక్ అహ్మద్ కుమారుడు.. అసద్ అహ్మద్ ను ఎన్ కౌంటరయ్యాడు. దానిమీద చర్చ జరుగుతుండగానే..
అతీక్ అహ్మద్, అతని తమ్ముడు అష్రఫ్ హత్యకు గురయ్యారు.
అసద్ అంత్యక్రియలు జరిగిన ప్రదేశానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే అతీక్ అహ్మద్, అష్రఫ్ హత్యచేశారు.తాము పుట్టిపెరిగి, నేర సామ్రాజ్యానికి కేంద్రంగా మలచుకున్న ప్రయాగ్రాజ్లోనే వారి కథ ముగిసిపోయింది. కొడుకు అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయానన్న ఆవేదనను మీడియా ఎదుట వెల్లబోసుకుంటుండగానే
పోలీసుల సాక్షిగా దుండగులు అతిదగ్గరగా కాల్పులు జరిపాడు.
ధూమన్గంజ్ పోలీస్స్టేషన్లో విచారణ అనంతరం వైద్య పరీక్షల కోసం రాత్రి 10 గంటలకు ఎంఎల్ఎన్ వైద్య కళాశాలకు తరలించారు. చేతులకు బేడీలతో ఉన్న ఇద్దరూ… మీడియాతో మాట్లాడుతూ ముందుకు నడుస్తున్నారు. కుమారుని అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా, ‘పోలీసులు తీసుకెళ్లలేదు. ఏం చేస్తాం?’ అని అతీక్ అన్నాడు. ఆ మాట పూర్తైందో లేదో… అక్కడున్నవాళ్లలోంచి ముగ్గురు చేతిలో పిస్టళ్లతో దూసుకొచ్చారు. పిస్టళ్లు తీసి అతీక్, అష్రఫ్ తలకు గురిపెట్టి కాల్చారు. అంతే ఇద్దరూ అక్కడికక్కడే నేలకొరిగారు. రెప్పపాటుకాలంలో ఇదంతా జరిగింది.
ఈ ఘటనతో పోలీసులు షాకయ్యారు. వెంటనే తేరుకుని దుండగులవైపెళ్లారు. ఇద్దరు అక్కడే లొంగిపోయారు. మూడోవాడు పరిగెత్తుతుంటే పట్టుకున్నారు. ఈ మొత్తం కెమెరాల్లో రికార్డయింది…
అతీక్ అహ్మద్, అష్రఫ్ ను హత్య చేసిన వారిని లవ్లేశ్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యగా గుర్తించారు. ముగ్గురు వాడిన మూడు బైకులను, రెండు పిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాగ్రాజ్లో 144 సెక్షన్ విధించారు. ఈ ఘటనకు సంబంధించి 17 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. దీనిపై యూపీ ప్రభుత్వం త్రిసభ్య జ్యుడీషియల్ కమిషన్ వేసింది. అటు అతీక్ బ్రదర్స్ హత్యను యూపీలో విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. యూపీలో నేరసంస్కృతి పెరిగిందని సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ అంటే… ఈ జంట హత్యలను ఎమ్ఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. యూపీలో తుపాకీ పాలన నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఈ హత్యలకు సంబంధించి మరో అంశం తెరమీదకు వచ్చింది. అతీక్ అహ్మద్ ఉత్తర్ ప్రదేశ్ పోలీసుకు ఇచ్చిన వాంగ్మూలంలో తనకు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఇంటర్ సర్విసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడించారు. ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్ లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. పాకిస్తాన్ ఐఎస్ఐతో ప్రత్యక్ష సంబంధాలు ఉండటంతో తనకు ఆయుధాల కొరత లేదని చెప్పినట్లు అందులో పేర్కొన్నారు. పాకిస్తాన్ నుంచి పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలు పడేస్తారని అతీక్ చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అతీక్ అహ్మద్ హత్యకు పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థల హస్తం ఉండవచ్చంటున్నారు. కావాలని హిందూ యువకులను అడ్డుపెట్టుకుని వాళ్లతో ఈ పని చేయించవచ్చంటున్నారు. దుండగులు కాల్పుల అనంతరం జైశ్రీరామ్ అని నినాదాలు చేశారు. సీఎం యోగి కావాలనే ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని అయన వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు .
ఇక ఆరున్నరేళ్లలో యూటీలో 10 వేల ఎన్ కౌంటర్లు జరిగినట్టు ప్రభుత్వమే లెక్కలు చెబుతోంది. ఇందులో ఇప్పటి వరకు మొత్తంగా 183 మంది క్రిమినల్స్ ను మట్టుబెట్టారు. ఒక్క మీరట్ జోన్ లో 2017 నుంచి ఇప్పటి వరకు 3,152 ఎన్ కౌంటర్లు జరగ్గా..వాటిలో 63 మంది క్రిమినల్స్ హతమయ్యారు. ఎన్ కౌంటర్లలో 13 మంది పోలీసులు అసువులు బాసారు. అలాగే 1424 మంది పోలీసులకు బుల్లెట్ గాయాలయ్యాయి.