పంద్రాగస్టు వేడుకల వేళ లష్కరే తోయబా, జైషే మహ్మద్ సహా పలు ఉగ్రసంస్థలు దేశంలో దాడులకు దిగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ముఖ్యంగా స్వాత్రంత్ర్య దినోత్సవాలు జరిగే రెడ్ ఫోర్ట్ ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించింది. ఉగ్రదాడులు జరిగే అవకాశాలపై 10 పేజీల రహస్య నివేదికను కేంద్రానికి పంపినట్టు సమాచారం. ఉదయపూర్, అమరావతి ఘటనలను ఉదహరిస్తూ ఐబీ నివేదికను పంపింది.
జనసమ్మర్ధ ప్రదేశాల్లో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై నిఘా వేయాలని ఐబీ సూచించింది. ప్రధాన నాయకులపై దాడులు చేయాలని… జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాదులను ఐఎస్ఐ కోరినట్టు ఐబీ తెలిపింది. అఫ్ఘానిస్థాన్ ఉగ్రవాది నేతృత్వంలో లష్కరే ఖల్సా పేరిట పాక్ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసిందని, ఆ సంస్థ ఉగ్రవాదులు జమ్మూకశ్మీరులో పెద్ద ఉగ్రదాడికి పాల్పడే అవకాశముందనీ హెచ్చరించింది. ఇక లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు పారాగ్లైడర్స్, డ్రోన్ల ద్వారా దాడులకు తెగబడే అవకాశమున్నందున బీఎస్ఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉండాలని ఐబీ కోరింది. ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఉంటున్న రోహింగ్యాలు, ఆప్ఘనిస్తాన్ వాసులు నివాసం ఉంటున్న ప్రదేశాల్లో నిఘా వేయాలనీ సూచించారు.