పలు అంతర్జాతీయ ఉగ్రసంస్థలతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించడం కలకలం రేపుతోంది. హఫీజుల్ మొల్లా ఏకంగా ఏడుసార్లు మమత ఇంటిముందు రెక్కీ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. కోల్ కతా లోని కాళీఘాట్ ప్రాంతంలో ఉన్నపూర్వీకుల ఇంటిలో మమత ఉంటారు. అయితే ఆ ఇంటి సమాచారం తెలుసుకునేందుకు ముల్లా ఏడుసార్లు అక్కడ తచ్చాడాడు. అంతేకాదు తన సెల్ ఫోన్ కెమెరాతో ఆ ఇంటిని ఫొటోలు తీశాడు. స్థానికంగా ఉండే చిన్నారులను టాఫీలతో రప్పించినట్టు తేలింది. ఇక జూలై 2 అర్థరాత్రి ముల్లా భద్రతాఏర్పాట్లు దాటి మమతా ఇంట్లోకి వెళ్తుండగా పోలీసులు గుర్తించారు. వెంటనే అదుపులోకి తీసుకుని ఫోన్ చూడగా అందులో మమత ఇంటి ఫొటోలున్నాయి. బంగ్లాదేశ్ తో పాటు జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలకు అతను కాల్స్ చేసినట్టు గుర్తించారు. అతనినుంచి 11 సిమ్ కార్డులుస్వాధీనం చేసుకున్నారు. గతేడాది సముద్రాన్ని ఈదుతూ బంగ్లాదేశ్ కు వెళ్లినట్టు…విచారణలో తెలుసుకున్న పోలీసులు…అక్కడ అతని కార్యకలాపాల గురించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే జెడ్ ప్లస్ సెక్యూరిటీని దాటుకుని ఇంటివరకు ఎలా వెళ్లాడన్నది పోలీసులకు అర్థం కావడం లేదు. అప్రమత్తమైన రాష్ట్ర హోంశాఖ ఆమె నివాసం, పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు.. సీఎం సెక్యూరిటీ డైరెక్టర్ వివేక్ సహాయ్ ను పోస్ట్ నుంచి తొలగించారు. అటు ముల్లా కస్టడీని జూలై 18 వరకు పొడిగిస్తూ సిట్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.