వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు టెన్షన్ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. స్థానికంగా అధికార టీఎంసీ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ప్రత్యర్ధులపై దాడులకు దిగుతుండటం.. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలోనే ఈసీ రాష్ట్రంలో ఎనిమిది దశల్లో పోలింగ్ నిర్వహిస్తోంది. తొలి దశ ఎన్నికలు ముగియగా.. ఏప్రిల్ 1వ తేదీన రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో అందరి దృష్టి నందిగ్రామ్ నియోజకవర్గంపైనే ఉంది. ఇక్కడి నుంనే టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ పోటిలో ఉన్నారు. మరోవైపు బీజేపీ నుంచి సువేందు అధికారి కూడా బలమైన ప్రత్యర్ధిగా ఉన్నారు. ఇరువురి మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. దీంతో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఈసీ ప్రత్యేక దృష్టి సారించింది. నందిగ్రామ్లో 144 సెక్షన్ను విధించింది. ఏప్రిల్ 2వ తేదీ వరకు నందిగ్రామ్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.