టి20 క్రికెట్లో ఇప్పుడు అమెరికన్ జట్టు క్రేజీగా నిలుస్తోంది. ప్రపంచ క్రికెట్లోకి మొదటి సారి అడుగుపెట్టిన అమెరికా.. జట్టు ఎంపికలో తెలివిగా వ్యవహరించింది. వివిధ వృత్తులలో అమెరికాలో స్థిరపడిన పౌరులందరికీ అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా భారత్ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన సౌరబ్ నేత్రావల్కర్ అవకాశం దక్కించుకున్నారు. ఇప్పుడు అమెరికన్ క్రికెట్ టీం లో క్రేజీ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నారు. పాకిస్తాన్ మీద అమెరికా జట్టు గెలుపులో ముఖ్యమైన పాత్ర సౌరబ్ దే.. అంతేకాకుండా భారత్ తో తల పడినప్పుడు కూడా అమెరికా ఓడిపోయినప్పటికీ.. సౌరబ్ ఆట తీరు ప్రశంసలు అందుకుంది. నిజానికి ఒకప్పుడు సౌరబ్ భారత్ టీం లో కూడా క్రికెట్ ఆడాడు.
ఇక్కడ మరో విశేషం కూడా కనిపిస్తోంది. సౌరబ్ అచ్చంగా తెలుగువారి ఇంటి అల్లుడు. ఆయన భార్య దేవి స్నిగ్ధ ముప్పాల. గుంటూరు జిల్లాకు చెందిన ఈ కుటుంబం చాలా కాలం క్రితమే బెంగళూరులో స్థిరపడింది. అందుచేత స్నిగ్ధ బాల్యమంతా బెంగళూరులోనే జరిగింది. అక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన స్నిక్త మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లారు. చదువు పూర్తి చేసుకుని ఒరాకిల్ కంపెనీలో ప్రిన్సిపల్ అప్లికేషన్ ఇంజనీర్ గా గా పనిచేస్తున్నారు. సహజంగా సాంప్రదాయ కథక్ డాన్సర్ కావడంతో స్నిగ్ధ అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు.
ఈ సమయంలో సౌరబ్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. రెండు కుటుంబాలకు సమ్మతం కావడంతో 2020లో ఈ జంట ఒక్కటి అయ్యారు. సాంప్రదాయానికి పెద్ద పీట వేసే కుటుంబాలు కావడంతో అచ్చమైన హిందూ సాంప్రదాయంలో పెళ్లి నిర్వహించారు. అప్పటినుంచి ఇద్దరు కెరీర్లో బిజీగా ఉన్నప్పటికీ కలిసి ముందుకు వెళ్లడం అలవాటు.
అలాగే సౌరబ్ ఎక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న స్నిగ్ధ తప్పనిసరిగా హాజరవుతారు. ఆట జరుగుతున్నంతసేపు భర్తను ఉత్సాహపరుస్తూ సందడి చేస్తూ ఉంటారు. అలాగే ఆమె నాట్యం ప్రోగ్రాం జరిగేటప్పుడు సౌరబ్ తప్పనిసరిగా హాజరవుతారు.
మొత్తం మీద తెలుగువారి అల్లుడు అయిన సౌరబ్ క్రికెట్లో మరింత రాణించాలని కోరుకుందాం.