భారత దేశంలోని గొప్ప పుణ్యక్షేత్రాలు అంటే కాశీ, రామేశ్వరం, సోమనాథ్ వంటివి గుర్తు వస్తాయి. ఆధునిక కాలంలో ఈ దేవాలయాలను పునర్ నిర్మించి భక్తులకు అందుబాటులో తెచ్చిన మహారాణి అహిల్యా బాయి. విదేశీ పాలకులు చెలరేగి పోయి దేవాలయాలను ధ్వంసం చేస్తుంటే, వాళ్లకు ఎదురొడ్డి భరత భూమి మీద అద్భుతమైన దేవాలయాలను నిలబెట్టిన ఘనత ఆమెదే.
రాణి అహిల్యాభాయి ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం. రాణి అహిల్యాబాయి హోల్కర్ 1725 మే 31న అతి సాధారణమైన పల్లెటూరి కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి చురుకుగా ఉంటూ ఆలయాలను తరుచూ సందర్శించేవారు. అదే సమయంలో.. అక్కడ శివాలయం దర్శనం కోసం వచ్చిన పీష్వా దృష్టిలో పడ్డారు. ఇండోర్ కేంద్రంగా సమీప గ్రామాలకు అధికారిగా ఉన్న మల్హారరావు హోల్కర్కి ఆ బాలికను చూపించారు. ఇటువంటి చురుకైన పిల్ల మీకు కోడలు అయినట్లయితే మీ సంస్థానం బాగా అభివృద్ధిలోకి వస్తుందని పీష్వా సలహాయిచ్చారు. ఆ సలహా మల్హారరావుకి నచ్చింది. బాలిక తండ్రి అయిన మాణకోజొ సిందేను ఒప్పించి, 1737 మే 20వ తేదీన కోడలుగా చేసుకొన్నారు. స్థానిక పాలకుడు అయిన మల్హార రావు కుమారుడు ఖండేరావు హోల్కర్ కు అహిల్యాబాయి ని ఇచ్చి వివాహం జరిపించారు.
ఆ విధంగా రాచమందిరంలో ఆమె అడుగుపెట్టారు. అక్కడ నుంచి ఆమె జీవితంలో ఎన్నెన్నో పరీక్షలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ దంపతులకు కొడుకు మాలేరావ్, కూతురు ముక్తా బాయి జన్మించారు. తనభర్త, రాజ్యవ్యవహారాలను పట్టించుకోకపోవటం గమనించి ఆ లోటును భర్తీ చేయడానికి మామగారి శిక్షణలో అనేక విషయాలను అహిల్య అభ్యసించింది. 1754 మార్చి 24న యువరాజు ఖండేరావు ఆకస్మిక మరణం తో పెద్ద సమస్య ఏర్పడింది. మామగారైన మల్హార రావు సూచన మేరకు రాజ్య నిర్వహణ వ్యవహారాలలో మరింత శ్రద్ధ వహించింది, పుణే నుండి పీష్వా, ఢిల్లీనుండి మొగలు పాదుషా, తదితరులు శోక సందేశాలను పంపించారు. నెమ్మదిగా రాణి అహిల్యాబాయి రాజ్య పాలన మీద పట్టు బిగించారు.
ఈ లోగా మరాఠా రాజకీయాల్లో కీలక మార్పులు వచ్చిపడ్డాయి. మూడవ పానిపట్ యుద్ధం తర్వాత మహారాష్ట్రులు, మొగలులు కలిసి అహమద్ షా అబ్దాలిని ఎదిరించారు. ఆ యుద్ద పరంపర లో అహిల్యాబాయి యుద్ధ నీతిని, చతురతను ఉపయోగించారు. సేనలను, ఆయుధాలను, మందు గుండు సామగ్రిని సమకూర్చుకొని కురుక్షేత్ర సమీపంలోని ‘గోహాడ్’ దుర్గాన్ని గెలుచుకొని వచ్చారు. ఒక్కొక్క అడుగులో, ఒక్కొక్క మెట్టు వద్ద అహల్యా బాయి యుద్ధనీతిని అభ్యసిస్తూ అడుగులు ముందుకు వేసింది.
ఇదే సమయంలో అహిల్యాకు ఇంటి కష్టాలు వచ్చి పడ్డాయి. 1761లో తనను తల్లివలె చూసుకొంటున్న అత్తగారు గౌతమా బాయి మరణించింది. 1764లో మామగారు మల్హరరావు మరణించారు. ఆ పైన రాజ్యపాలన భారమంతా అహల్యబాయి మీద పడింది. కొద్ది కాలానికే కొడుకు, ఆ తర్వాత అల్లుడు, ఆ పై కుమార్తె చనిపోవటంతో అహిల్యాభాయి ఒంటరిగా మారిపోయారు. అయినప్పటికీ, రాజ్యంలోని ప్రజలందరికీ పెద్ద దిక్కుగా మసులుతూ 1795 వరకు పరిపాలన సాగించారు. అతి తక్కువగా పన్నులు విధించటము, ప్రజలకు అత్యధిక స్థాయిలో సదుపాయాలు సమకూర్చటము, శాంతి భద్రతల రక్షణ, నేరవిచారణ, పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమల అభివృద్ధి మొదలైన ఎన్నోవిషయాలలో ఆమె ఉన్నత ప్రమాణాలను నెలకొల్పింది.
నిజానికి అహిల్యా బాయికి పట్టుదట ఎక్కువ. రాజ్యనిర్వహణలోను, సేనలను నడిపించటంలోనూ, మల్హారరావు లక్షణాలను అహిల్యాబాయి పుణికి పుచ్చుకొన్నారు. తక్కువ సైన్యాన్ని వినియోగించి, ఎక్కువ విజయాలను సాధించటం ద్వారా రాజ్యాన్ని పటిష్టంగా ఉంచుకొన్నారు. ప్రజాధనాన్ని సద్వినియోగమయ్యేలా చూడటం తమ బాధ్యత అని, దానిని వ్యక్తిగత అవసరాలకు వాడరాదని కఠోర నియమంతో వ్యవహారించారు. రాజ్య కోశాగారానికి సంబంధించిన లెక్కలను అహల్యాబాయి ప్రతిరోజూ చూస్తూ ఉండేది. వాటి దుర్వినియోగానికి ఎవరూ పాల్పడకుండా జాగ్రత్త వహించేది. ఫలితంగా కోశాగారంలో ఎప్పుడూ తగినంతగా ధనం అందుబాటులో ఉండేది.
చాలా సార్లు పట్టు విడుపు తో ఆమె ముందుకు సాగారు. యుద్ధ సమయంలో కూడా చాతుర్యం ప్రదర్శించి పైచేయి సాధించేవారు. అహిల్యాబాయి ఒంటరి మహిళ కాబట్టి ఆమె రాజ్యం లాక్కొనేందుకు గంగాధర్ చంద్రచూడ్ వంటి వారు కుట్ర పన్నారు. మరికొందరు రాజ ప్రముఖులను కూడా కలుపుకొని, పెద్ద సైన్యంతో ఇండోర్ పైకి .. అన్ని వైపుల నుంచి వచ్చి పడ్డారు. సరిహద్దుల్లోని రాజులకు ఆమె తెలివిగా విడివిడిగా లేఖలు పంపించారు. ”ఎటువంటి యుద్ధానికైనా మా సేనలు సిద్ధంగా ఉన్నాయి. ఒక ఒంటరి మహిళ మీద విజయం సాధించటంవల్ల మీ గౌరవమేమీ పెరగదు – కానీ, ఈ యుద్దంలో ఓడిపోతే మాత్రం.. మహిళ చేతిలో ఓడిపోయారంటూ పరువు పోతుంది. ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి” ఈ లేఖలలో అహిల్యాబాయి హెచ్చరించింది. దీంతో ఆ రాజులకు అనుమానం మొదలైంది. దీంతో మీ ఏకైక పుత్రుని కోల్పోయిన సందర్భంగా పరామర్శించ వస్తున్నామని మాట మార్చారు. పరామర్శించ వచ్చేవారు పల్లకీలో రావచ్చు. ఈ రాజ్యం మీది, ఎన్నాళ్లయినా ఉండవచ్చు. ఇంత సైన్యంతో రావటమెందుకు? అని అహల్యాబాయి నిలదీసింది. సైన్యాన్ని వదిలిపెట్టి పల్లకీలో ఇండోర్కి వెళ్లి మర్యాద దక్కించుకొన్నారు. గండం నుంచి తెలివిగా తప్పించిన అహిల్యాబాయి కి ఇండోర్ ప్రజలు జేజేలు పలికారు.
మరాఠా రాణికి ముందు చూపు ఎక్కువ. నర్మదా నదీ తీరంలో ఉన్న మహేశ్వరానికి రాజధానిగా చేసికొని నివసించింది. అక్కడ అనేక స్నాన ఘట్టాలు ఏర్పాటు చేసి, 60 దాకా దేవాలయాలు నిర్మించారు. వాటిని ఇప్పటికీ మనం చూడవచ్చు. మహేశ్వరం ఒక చిన్న గ్రామం అయినందున అన్ని రకాల వసతులు అక్కడ, నెలకొనే విధంగా వివిధ వృత్తుల వారు వచ్చి తమ పరిశ్రమలను, వ్యాపారాలను తెరవడానికి ప్రోత్సహించింది. వివిధ విషయాలలో నిపుణులైన వారికి ఆహ్వానించి వారికి నివాసాలు ఏర్పరిచింది. తెలంగాణ నుండి వేద విదుడైన గోళే శాస్త్రిని, గుజరాత్ నుండి జ్యోతిష్యశాస్త్ర విద్వాంసుడైన ప్రవీణ్ గణేశ్ భట్, రఘనాథ వైద్యుని, రత్నగరి (మహారాష్ట్ర) నుండి పూజారి రామచంద్ర రానడే గార్లను రప్పించి, నివాసము లేర్పరచి, గౌరవించింది.
అహిల్యాబాయి లో మరో గొప్ప లక్షణం కూడా ఉంది. ఆమె పరిపాలనకు వచ్చిన తర్వాత డబ్బు లెక్కల విషయంలో కచ్చితంగా ఉండేవారు. ముందు తీసుకొన్న ధనానికి సంబంధించి పూర్తిగా లెక్కలు సమర్పించిన తర్వాతనే మరొకసారి ధనాన్ని విడుదల చేయటమనే పద్ధతిని ప్రవేశపెట్టింది. మొదట్లో కష్టమని తోచినా, క్రమంగా అందరూ ఆ పద్థతికి అలవాటుపడక తప్పలేదు. ఈ డబ్బుల లెక్కల విషయంలో ఒక అధికారికి సంబంధించి అహల్యబాయి నిర్ణయంలో తుకోజీ అనే నాయకుడు జోక్యం చేసుకొన్నారు. ఆమె కోపగిస్తు౦దనే భయంతో, తుకోజీ గ్వాలియార్ సంస్థానాధీశుడైన మహద్ జీ సిందే సహాయం కోరాడు. అహల్యాబాయికి నచ్చజెప్పి వ్యవహారం సర్దుబాటు చేయాలని ప్రార్థించాడు. ఆయన – నేను పేష్వా గారికి, మొగలులకు, భోంస్లేకి ఎవరికైనా ఒక మాట చెప్పి నెగ్గించుకోగలను, కానీ నేను అహల్య బాయికి చెప్పలేను. ఎందుకంటే ఆమె ఏదైనా ఒక పని చేసినదంటే, ఆ పని వెనకాల ఎంతో పరిశీలన, అధ్యయనమూ, అవగాహన ఉంటుంది. అటువంటి పనిని తిరగదోడమని నేనెలా చెప్పను?’ అన్నాడు. మహాద్ జీ సిందే చెప్పిన ఈ మాటలు అహల్య బాయి పరిపాలన విధానానికి తిరుగులేని ప్రశంసా పత్రం వంటిది. అప్పటి నుండి తుకోజీ కూడా అహల్య బాయి ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించటం జరిగింది.
ఆమె గొప్పతనం ఏమిటంటే.. రాజ్య పరిపాలన లో సామాన్యుల జీవనానికి పెద్ద పీట వేశారు. వ్యవసాయాన్ని అమితంగా ప్రోత్సహించారు. చేల గట్లమీద నిమ్మ, వేప, మేడి, మర్రి, మామిడి వంటి చెట్లు పెంచాలని ప్రోత్సహించింది. తద్వారా నీడను, ఫలాలను ఇచ్చే చెట్ల ద్వారా మనుషులకు, పక్షులకూ లభించే ప్రయోజనంతో పాటు భూసారం కొట్టుకు పోకుండా, రైతులకు వ్యవసాయంలోనూ లాభం కలిగేది. మట్టితో చేసిన శివలింగాలను పూజించి, వాటిని నదిలో నిమజ్జనం చేస్తుండేది. ఆ శివలింగాలలో కొన్ని రకాల ధాన్యం గింజలు, కొన్ని విత్తనాలూ ఉండేవి. అవి జలప్రవాహంలోని జలచరాలకు ఆహారంగా ఉపయోగపడేవి. పైగా ఈ విత్తనాలు ఎక్కడైనా గట్లను తాకితే అక్కడ అవి మొలకెత్తి వృక్షాలుగా ఎదగడం జరుగుతుందని ఆమె ఆలోచన.
అసలు విషయం ఏమిటంటే.. దేవాలయాల పునరుద్ధరణ ద్వారా ఆమె అందనంత ఎత్తున నిలిచారు. ఆమె నిర్మించిన దేవాలయాల జాబితాలో పశ్చిమాన ద్వారక, సోమనాథ్ క్షేత్రాల నుండి తూర్పున పూరీ వరకు, ఉత్తరాన కాశీ నుండి దక్షిణాన రామేశ్వరం వరకూ కనబడతాయి. ఆలయ పునరుద్ధరణతో పాటు యాత్రికుల సౌకర్యార్థం నదుల వద్ద స్నానఘట్టాలను, తీర్థక్షేత్రాలలో అన్న సత్రాలనూ ఏర్పరిచింది. స్థానఘట్టాల వద్ద మహిళలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయించింది. ఈ పనులన్నీ కూడా ఆమె రాజ్య కోశాగారం నుండి ఒక రూపాయి కూడా తీయకుండా స్వంత సంపద నుండే వెచ్చించింది.
నిజానికి రాణి అహిల్యాభాయి పుట్టింది సామాన్య కుటుంబంలో. ఆమె అడుగు పెట్టిన రాజ కుటుంబం కూడా చిన్నదే. కానీ పట్టుదల, దీక్ష, ముందు చూపుతో ఆమె అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొన్నారు. మహిళ పరిపాలనలో సుగుణాలు ఉంటాయి అని చాటి చెప్పారు.