విదేశీ వ్యవహారాలలో ఐక్యరాజ్యసమితికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. అన్ని ప్రపంచ దేశాలతో వ్యవహరించే ఐక్యరాజ్యసమితికి లో భారత్ తరపున ఒక బృందం పనిచేస్తుంది. దీనికి నాయకత్వం వహించే అధికారి భారతదేశ ప్రతినిధిగా ఐక్యరాజ్యసమితిలో వ్యవహరిస్తారు. గొప్పదైన ఈ అవకాశం తెలుగు అధికారి అయిన హరీష్ పర్వతనేనికి దక్కింది.
ప్రస్తుతం ఆయన జర్మనీలో భారత రాయబారిగా ఉన్నారు. త్వరలోనే న్యూయార్క్ వెళ్లి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. హరీశ్ పర్వతనేని 1990 బ్యాచ్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. 2021 నవంబర్ నుంచి జర్మనీలో భారత రాయబారిగా పని చేస్తున్నారు. అంతకు ముందు విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి (ఆర్థిక వ్యవహారాలు) గానూ బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో భారత్ అనేక దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలను చేసుకునేలా కృషి చేశారు.
వీటితో పాటు జీ20, జీ 7, బ్రిక్స్, ఐబిఎస్ఏ లాంటి కూటముల్లోని ఆర్థిక వ్యవహారాలకు నేతృత్వం వహించారు. సియారో, రియాద్ సహా భారత్ చేపట్టిన అనేక మిషన్లలో ఆయన పనిచేశారు. ఇజ్రాయెల్తో యుద్ధం జరుగుతున్న పాలస్తీనాలోని గాజా సిటీకి భారత ప్రతినిధిగా వెళ్లారు. అక్కడ ఐక్యరాజ్య సమితి మానవతా సాయం కార్యక్రమంలో పాలసీ అనాలిసిస్ యూనిట్ చీఫ్గాను బాధ్యతలు నిర్వర్తించారు.
ఆ తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖలోని తూర్పు ఆసియా, విదేశాంగ ప్రచార విభాగాల్లోనూ పనిచేశారు. 2007 నుంచి ఐదేళ్ల పాటు భారత ఉపరాష్ట్రపతి వద్ద ఓఎస్డీగా ఉన్నారు. అనంతరం 2012 నుంచి 2016 వరకు అమెరికాలోని హౌస్టన్లో 8 రాష్ట్రాలకు సంబంధించిన కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు వియత్నాం రాయబారిగా బాధ్యతలు నిర్వహించారు.
తెలంగాణ హైదరాబాద్ కు చెందిన హరీశ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. గోల్డ్ మెడల్ కూడా సంపాదించారు. ఆ తర్వాత బంగాల్ కోలకతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లోనూ విద్యను అభ్యసించారు. ఆ తర్వాత 1990లో ఇండియన్ ఫారిన్ సర్వీస్ కు ఎంపికయ్యారు.
తెలుగు అధికారికి గొప్ప అవకాశం దక్కడం పట్ల అనేకమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.