తెలుగు భాష ఒక అద్భుతమైన భాష అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ప్రతి నెల చివరి ఆదివారం నాడు ఆకాశ వాణి ద్వారా నరేంద్ర మోదీ తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకోవడం ఆనవాయితీ. ఈ నెలలో కూడా 25వ తేదీ ఆదివారం నాడు దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ఈసారి మన్ కి బాత్ లో తెలుగు భాష గురించి ప్రత్యేకంగా నరేంద్ర మోదీ ప్రస్తావన చేశారు. ఈ నెల 29న తెలుగుభాష దినోత్సవాన్ని పురష్కరించుకుని ప్రపంచంలోని తెలుగు మాట్లాడే వారందరికీ తెలుగుభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
వికసిత్ భారత్ లక్ష్యం దిశగా దేశ పునాదులను పటిష్ఠం చేసే ఎన్నో విషయాలు 21వ శతాబ్దంలో జరుగుతున్నాయని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు.
రాజకీయాల్లోకి రావాలని లక్ష మంది యువజనులకు తాను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పిలుపు ఇచ్చానని, ఆ పిలుపునకు యువత నుంచి విశేషంగా స్పందన వచ్చిందని తెలిపారు.
యువత క్రియాశీల రాజకీయాల వైపు మొగ్గు చూపుతోందని ప్రధాని వెల్లడించారు. వారికి సరైన అవకాశం, మార్గదర్శనం ఇవ్వవలసిన అవసరం ఉందని ఆయన సూచించారు. రాజకీయ నేపథ్యం ఏమీ లేకుండా యువజనులు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యాన్ని దృఢతరం చేస్తుందని మోదీ చెప్పారు.
అభివృద్ధి చెందిన దేశం, బలమైన ప్రజాస్వామ్యం కోసం నేటి యువత ప్రజా జీవితంలోకి రావాలని ప్రధాని పునరుద్ఘాటించారు.
స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. దేశం కోసం వారు తమని తాము పూర్తిగా అంకితం చేసుకున్నారని తెలియజేశారు.
నేడు వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి మనం మరోసారి అదే స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. పెద్ద సంఖ్యలో యువత రాజకీయాల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వారికి సరైన అవకాశం, మార్గదర్శకత్వం కావాలని తెలియజేశారు. కుటుంబ రాజకీయాలు నూతన ప్రతిభను అణచివేస్తాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.
వికసిత భారత్ గురించి ప్రధాన మంత్రి మోతి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంటున్నది