టీఆర్ఎస్ చెప్పుకుంటున్న అభివృద్ధి ఇదే
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2016లో హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ప్రచార బాధ్యతలను అన్నీ కేటీఆర్ తానై నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు ఆయనను విశ్వసించారు. కేటీఆర్పై తమకు గల ఆదరాభిమానాలను ఓట్ల రూపంలో కుమ్మరించారు. హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఏ పార్టీకి, ఏనాడూ రానంత మెజారిటీ టీఆర్ఎస్ కు లభించింది. ఆ విజయంతో బల్దియాలో పాగా వేసిన టీఆర్ఎస్ హైదరాబాద్ నగరాభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ తాము చేశామని చెప్పుకుంటున్న అభివృద్ధి ఇదే… హైదరాబాద్ మహానగరం నివాసయోగ్యతలోనూ, ఉపాధి కార్యక్రమాల అమలులోనూ దేశంలోని 34 నగరాల్లో మొదటిస్థానంలో ఉన్నట్లుగా ప్రముఖ వెబ్సైట్ ఒకటి ఈ మధ్య వెల్లడించింది.
24 గంటల కరెంటు, ఇంటింటికీ రక్షిత మంచినీటి సౌకర్యం, కట్టుదిట్టమైన శాంతిభద్రతలు, చవకైన జీవన విధానం, గంగా జమున తెహజీబ్, పెట్టుబడులు పెడుతున్న అంతర్జాతీయ సంస్థలు, ఆకర్షణీయమైన ప్రభుత్వ విధానాలు, అనువైన భౌగోళిక వాతావరణం, మెట్రో రవాణా వంటి ప్రపంచస్థాయి సౌకర్యాల మూలంగా హైదరాబాద్ నగరం దినదినాభివృద్ధి చెందుతోంది. దీర్ఘకాలంగా ఉన్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ఎస్.ఆర్.డి.పి లో భాగంగా రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, జంక్షన్ల అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు.
24 వేల కోట్లతో 137 కిలోమీటర్ల 7 స్కైవేలను, 166 కిలోమీటర్ల పొడవుతో 11 మేజర్ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నారు. గచ్చిబౌలి మైండ్స్పేస్ జంక్షన్, కూకట్పల్లి, ఎల్.బినగర్, అయ్యప్ప సొసైటీ వంటి ప్రాంతాల్లో రద్దీని తగ్గించడానికి ఫ్లైఓవర్ల నిర్మించారు. ఇందిరాపార్క్, ఒవైసి జంక్షన్ లలో స్టీల్బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా 46 ఫ్లైఓవర్ల నిర్మాణం, 27 మిస్సింగ్ రోడ్ల నిర్మాణం కొనసాగుతోంది. సిఆర్ఎంపి ద్వారా 709 కిలోమీటర్ల రోడ్లను ఏడు ప్యాకేజీలుగా విభజించి నిర్వహిస్తున్నారు. ఉప్పల్–నాంపల్లి స్కైవేను నిర్మిస్తున్నారు. నగరంలో 3,42,645 సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. సిసి ఏర్పాట్లలో హైదరాబాద్ నగరం దేశంలోనే మొదటిస్థానంలో, ప్రపంచంలో ఆరోస్థానంలో ఉంది. నేరాలు అరికట్టడంలో అవి మూడోకన్నుగా పని చేస్తున్నాయి. పోలీస్ శాఖ ఇప్పటివరకు 18,235 నేరాలను సిసిటీవీల ద్వారానే గుర్తించింది. షా కన్సల్టెన్సీ ఇచ్చిన నివేదిక ప్రకారం మూడుదశల్లో భూగర్భ డ్రైనేజీ పనులు చేపడుతున్నారు. నగరంలో ప్రస్తుతం ఉన్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పాతపడినందున, అవసరమైన చోట్ల పైప్లైన్లు మార్చడం వంటి పనులతో పాటు చుట్టుపక్కల మునిసిపాలిటీల్లో కొత్తగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కార్వాన్ పరిధిలో రూ.380 కోట్లతో పాత వ్యవస్థ స్థానంలో కొత్తవ్యవస్థ నిర్మాణం జరుగుతోంది. ఎల్.బినగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం వంటి చుట్టుపక్కల మున్సిపాలిటీలలో రూ.37వేల కోట్లతో పనులు చేపట్టేందుకు త్వరలో టెండర్లు పిలవనున్నారు.
పౌరులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా కేటీఆర్ ఆరేళ్లుగా నగర పాలనలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. 2019లో అమల్లోకి వచ్చిన తెలంగాణ మునిసిపల్ చట్టం, అధికారులను, ప్రజాప్రతినిధులను పౌరులకు బాధ్యులుగా చేస్తూ విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చింది.
2004 నుంచి 2014 వరకు పదేళ్ళ కాలంలో జిహెచ్ఎంసి పరిధిలో రూ. 4,636 కోట్లు ఖర్చు కాగా తెరాస ప్రభుత్వం గత ఆరేళ్ళలో హైదరాబాద్ నగరాభివృద్ధికి చేసిన ఖర్చు రూ.32వేల కోట్లు దాటింది. దీనితో దేశంలోని ఏ మెట్రో నగరంలో జరగని రీతిలో హైదరాబాద్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఐటి రంగంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి కంపెనీలయిన ఐదింటిలో ఒకటి 2001లో హైదరాబాద్లో తమ విభాగాన్ని ఏర్పాటు చేయగా తెరాస ప్రభుత్వం హయాంలో మిగిలిన నాలుగు కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఇవి ఆయా కంపెనీలకు సంబంధించిన రెండో అతి పెద్ద కార్యాలయాలు. అమెజాన్, ఫేస్బుక్, గూగుల్, ఉబెర్ -ఇలా ఎన్నో కంపెనీలు ఇక్కడికొచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన ఫార్మాసిటీ కూడా అతిత్వరలోనే మహేశ్వరం వద్ద అందుబాటులోకి రానుంది. ఈ కంపెనీల వల్ల నగరంలో ఉపాధి అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి.
విశ్వనగరంగా ఖ్యాతి గడించిన భాగ్యనగరం ఇకమీదట ఉద్యానవనాలతో కళకళలాడనుంది. దీనికి తగినట్లుగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. కేటీఆర్ సూచన మేరకు జిహెచ్ఎంసి పరిధిలో 1,727 ఎకరాల విస్తీర్ణంలో రూ.120 కోట్ల వ్యయంతో అందమైన థీమ్ పార్కుల నిర్మాణానికి బల్దియా శ్రీకారం చుట్టింది. వీటిలో పచ్చదనానికే పెద్దపీట ఉంటుంది. ఇప్పటికే 3,084 ఖాళీ స్థలాలను ఈ పార్కుల నిర్మాణం కోసంం జిహెచ్ఎంసి గుర్తించింది. ఎకరం, అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంగల స్థలాలలో వాటిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. జోన్ల వారీగా 50 ప్రాంతాలలో ఒక్కొక్క పార్కును రూ. 2 కోట్ల నుంచి రూ. 2.50 కోట్ల ఖర్చుతో నిర్మించనున్నారు.
విద్యార్థుల కోసం సైన్స్పార్కులు, దట్టమైన అడవులను తలపించే జపనీస్ పార్కులు, వ్యాయామం చేసుకోడానికి, ఆరోగ్యం పెంపొందించుకోడానికి పంచకర్మ పార్కులు, పిల్లల కోసం ఆటవస్తువులు, విజ్ఞానాన్ని పెంపొందించే వివిధ అంశాలతో కూడిన పార్కులు, మహిళల కోసం ప్రత్యేక పార్కులు, వెదురు చెట్ల పార్కులు, అన్ని వయసుల వారికి అవసరమైన రీతిలో మల్టీ జనరేషన్ పార్కులు, వినోదం కోసం కమ్యూనిటీ పార్కులు, అందమైన రాక్గార్డెన్స్, పండుగ వాతావరణం తలపించే బతుకమ్మ పార్కులు, ప్లే పార్కులు, ఏడు రకాల ప్రత్యేకతలతో కూడిన సెవెన్ వండర్స్– ఇలా వివిధ రకాల థీమ్ పార్కులు నగర ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంతేకాక టోపెరి గార్డెన్, కలర్స్ పార్క్, మొఘల్ గార్డెన్, ఇంటరాక్టివ్ పార్క్, సువాసనలు విరజిమ్మే ఫ్రాగ్రన్స్ పార్కులు ఈ థీమ్పార్కులలో మరికొన్ని. పెంపుడు జంతువులకు కూడా ఆహ్లాదాన్ని కలిగించే పార్కుల్లో భాగంగా కొండాపూర్లో శునకాల కోసం ఒక ప్రత్యేక పార్క్ను ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాద్ వివిధ భాషా సంస్కృతుల సమ్మేళనంతో కూడిన మెట్రోపాలిటన్ నగరం. ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాలవారివే కాక, ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల రుచులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మొదటి నుంచి వివిధ మతాలవారు, వివిధ భాషలవారు కలిసి మెలిసి జీవిస్తున్నారు. ఇది ఒక మినీ భారతదేశం. పొరుగు రాష్ట్రాల వారైన తమిళులు, కన్నడిగులు, మహారాష్ట్రులు మాత్రమే కాక, సుదూర ప్రాంతాలవారైనా మలయాళీలు, బెంగాలీలు, గుజరాతీలు, మరాఠీలు మొదలైన వారంతా వందల సంవత్సరాలుగా స్థిరపడి, తమతమ సమాజాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు సేవా కార్యక్రమాలను కూడా విరివిగా నిర్వహిస్తున్నారు. అలాగే ఇతర దేశాల వారికి కూడా నెలవుగా మారడంతో హైదరాబాద్ ఆర్థికంగానే కాక సామాజికంగా, సాంస్కృతికంగా కూడా విశ్వనగరిగా రూపొందింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.