అరాచక పోలీస్ రాజ్యం!
కల్వకుంట్ల కుటుంబ పాలనలో తెలంగాణ పోలీసు యంత్రాంగం రాక్షస కాండను కొనసాగిస్తూనే ఉందనే అపఖ్యాతిని మూటగట్టుకుంది. జనగామలో జరిగిన దారుణ ఘటన, ఫ్రెండ్లీ పోలీస్ అమానుషకాండకు పరాకాష్ట. బిజెపి నేతను పోలీసులు, ముఖ్యంగా ఇన్ స్పెక్టర్ ఇష్టం వచ్చినట్టు కొట్టిన తీరు చూస్తుంటే విపక్షాలపై విరుచుకు పడితే ప్రమోషన్ గ్యారంటీ అనే ఆఫర్ ఉందేమో అనిపిస్తుంది. కరుడుగట్టిన ఉగ్రవాదులను కూడా పోలీసులు అంత దారుణంగా కొట్టడం కనీ వినీ ఎరుగం. ఇలాంటి పోలీసులనే కల్వకుంట్ల వారు పెంచి పోషిస్తున్నారేమో.
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బిజెపి నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్లను పోలీసులు తొలగించారు. ఊరూరా టిఆర్ ఎస్ వాళ్లు ఎలా ఫ్లెక్సీలతో స్తంభాలను గోడలను ముంచెత్తుతున్నారో తెలుసు. స్వామి వివేకానంద జయంతి బ్యానర్లను ఎందుకు తొలగించారని అడగటం నేరం కాదు. అయినా ఒక పోలీసు అధికారి, అతడి సహ పోలీసులు రాక్షసంగా ప్రవర్తించి ఒక వ్యక్తిని గొడ్డును బాదినట్టు బాదిన ఘటన అమానుషం కాదు. అంతకంటే ఎక్కువే. కెసిఆర్ పాలనలో నిజాం కాలం నాటి దొరల తరహా పాలన సాగుతున్నది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తే తప్పేముంది? జరుగుతున్నది అదే అని జనగామ ఘటన మరోసారి రుజువు చేసింది.
ధర్నాచౌక్ ను ఎత్తివేసిన అత్యంత అప్రజాస్వామిక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒక్కరేనేమో. గడీల దొరల పాలనను కొనసాగించడానికి, ప్రశ్నించే వారు ఉండకూడదనే ఉద్దేశంతోనే ధర్నా చౌక్ కు కెసిఆర్ పాడెకట్టారని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. చివరకు హైకోర్టు పుణ్యమా అని మళ్లీ ధర్నాచౌక్ అందుబాటులోకి వచ్చింది. పోలీసు యంత్రాంగాన్ని భయానకంగా దుర్వినియోగం చేస్తున్నది కూడా తెలంగాణ ప్రభుత్వమే అనే విమర్శలు తీవ్రంగానే ఉన్నాయి. ప్రమోషన్లకోసం పోలీసులు పోటీ పడి ప్రతిపక్షాల మీద ప్రతాపం చూపిస్తున్నారా? రేపు అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ ఎస్ ఓడిపోయి బిజెపి గెలిస్తే? ఖాకీ అరాచకాలపై విచారణ మొదలుపెడితే ఎంత మంది పోలీసులు జైలుకు పోవాల్సి ఉంటుందో? కాలమే నిర్ణయించాలి.