తెలంగాణలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి పార్లమెంటు ఎన్నికల్లో సత్తాను చాటుతూ దాదాపు సగం సీట్లు అంటే ఎనిమిది నియోజకవర్గాన్ని గెలుచుకోవడం జరిగింది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బిజెపి గట్టి పోటీ ఇచ్చింది.
నిజానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి బాగా బలపడుతుందని భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఎనిమిది సీట్లకే పరిమితం అయింది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి బలం పుంజుకుని సగం సీట్లు చెక్కించుకుంది మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో అవస్థలు ఎదుర్కొంది. 8 సీట్లలో గెలుపు సాధించినప్పటికీ పార్టీ శ్రేణులకు ఉత్సాహం దక్కలేదు.
ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయింది. చాల నియోజకవర్గాలలో మూడో స్థానికే పరిమితమైపోయింది. కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాలలో విజయం సాధించగా, ఏఐఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసి మరోసారి హైదరాబాద్ నుండి గెలుపొందారు.
కాంగ్రెస్ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకే దాదాపుగా పరిమితమయింది. బిజెపి నుండి కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుండి తిరిగి గెలుపొందగా, మాజీ మంత్రి, బిజెపి ఉపాధ్యక్షురాలు డి కె అరుణ మహబూబ్ నగర్ నుండి గెలుపొందారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతజిల్లాలో, ఆయన సొంత అభ్యర్హ్డిని ఆమె ఓడించారు.
బిజెపి ఎంపీలు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నుండి, డి అరవింద్ నిజామాబాదు నుండి తిరిగి గెలుపొందారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుండి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల నుండి, మాజీ ఎమ్యెల్యే ఎం రఘునందన్ రావు మెదక్ నుండి, జి నగేష్ ఆదిలాబాద్ నుండి బిజెపి అభ్యర్థులుగా గెలుపొందారు.
నల్గొండలో మాజీ మంత్రి కె జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. ఖమ్మంలో రామసాయం రఘురామిరెడ్డి , భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. పెద్దపల్లి, జహీరాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్, మహబూబాబాద్ స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో 8 అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుపొందిన బీజేపీ ఏకంగా 8 లోక్ సభ స్థానాలను గెలుచుకొని తెలంగాణాలో తన సత్తా చాటుకొంది. 2019లో గెల్చుకున్న 4 స్థానాలకన్నా రెట్టింపు స్థానాలు గెలుపొందడం గమనార్హం.
కాగా, బిఆర్ఎస్ సిట్టింగ్ స్థానం సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్, నివేదితపై గెలుపొందారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 65 చేరితే, బిఆర్ఎస్ బలం 38కి జారింది.
ఈసారి ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిష్మా బాగా పనిచేసింది అని చెబుతున్నారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ చాలా వరకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ఈ అసంతృప్తి బిజెపికి కలిసి వచ్చింది.. దీంతో కమలం పార్టీ ప్రభంజనం సృష్టించినట్లు అయింది.