సుప్రీంకోర్టులో కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. సీజేఐ ధర్మాసనం ముందు ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే స్టేటస్ కో ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. కేసులో మెరిట్స్ ఉంటే హై కోర్టు తీర్పును రివర్స్ చేస్తామని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఈ నెల 17న విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకీ అప్పగించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ నెల 13న విచారించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లుత్రా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. త్వరితగతిన విచారించడానికి నిరాకరిస్తూ.. 17వ తేదీన విచారిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సీబీఐ చేతికి సాక్షులు వెళ్తే చేసేది ఏమీ లేదని సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. మెరిట్స్ ఉంటే హై కోర్టు తీర్పును రివర్స్ చేస్తామని పేర్కొంది.