అసెంబ్లీ వ్యవహారాలలో ఎత్తుగడలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. రాజకీయ పార్టీలు తెలివిగా అడుగులు వేయాల్సిన వేదికగా శాసనసభను చెప్పవచ్చు. సభ నిబంధనలను జాగ్రత్తగా అనుసరిస్తూ ఎత్తుగడలు అమలు చేయాలి. అసెంబ్లీ రూల్ బుక్ అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ వేసిన స్కెచ్ ఫలించింది. సాంకేతికంగా ఉన్న అంశాల కారణంగా గులాబీ పార్టీ ఈ విషయంలో బుక్ అయిపోయింది అని అనుకోవాలి.
అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వం చేసే ఖర్చులను ఈ కమిటీ సమీక్ష చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీసే అవకాశం ఉంటుంది. రాజ్యాంగం సాంప్రదాయాల ప్రకారం ఈ కమిటీ చైర్మన్ పదవిని ప్రతిపక్షాలకు ఇస్తారు. అంతేకాకుండా ఈ చైర్మన్ కు క్యాబినెట్ మంత్రి హోదా కల్పిస్తారు. ఫలితంగా ప్రతిపక్ష ఎమ్మెల్యే దర్జాగా అసెంబ్లీలోనే కాకుండా రాష్ట్రమంతా ఈ మంత్రి హోదాని ఉపయోగించుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీసేందుకు అవకాశం ఏర్పడుతుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో వెళుతుంది అని అంతా ఆశించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవికి నామినేషన్ వేయాల్సిందిగా అసెంబ్లీ సచివాలయం నుంచి ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి పిలుపు వచ్చింది. అటువంటి సందర్భాలలో పార్టీ లోపల అంతర్గతంగా మాట్లాడుకుని బలమైన నాయకుడు నామినేషన్ వేయడం రివాజు. అలాగే ఈ కమిటీలో సభ్యుల పదవులు కూడా నామినేషన్ వేసుకున్న ఎమ్మెల్యేలకు స్పీకర్ కేటాయిస్తారు. ఇక్కడే గులాబీ పార్టీ బుట్టలో పడిపోయింది.
కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చడీ చప్పుడు లేకుండా ఈ పదవి కోసం నామినేషన్ వేశారు. ఒకరకంగా చెప్పాలి అంటే గాంధీ ఇప్పటికే గోడ దూకేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అనే అనుకోవాలి. కానీ శాసనసభ నిబంధనల ప్రకారం ఆయన ఇంకా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు గానే కొనసాగుతున్నారు. దీనిని అడ్డం పెట్టుకుని ఆయన తెలివిగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవికి నామినేషన్ వేసేసారు. ఇంకా చెప్పాలి అంటే కాంగ్రెస్ పార్టీ వెనక ఉండి ఈ పని చేయించింది అనేది బహిరంగ రహస్యం.
అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నామినేషన్ లు పడ్డాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న స్పీకర్ ప్రసాద్ కుమార్ దీని మీద నిర్ణయాన్ని ప్రకటించారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికేపూడి గాంధీని ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంగతి తెలియగానే గులాబీ పార్టీ నెత్తీ నోరు కొట్టుకుంది. గులాబీ పార్టీకి దూరంగా జరిగిపోయిన అరికెపూడి గాంధీకి ఎలా పదవి ఎలా ఇస్తారు అంటూ బీఆర్ఎస్ సభ్యులు మండిపడుతున్నారు.
దీనికి శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తెలివిగా సమాధానం చెప్పారు. అసెంబ్లీ రూల్ బుక్ ప్రకారం ప్రతిపక్షా సభ్యుడుకి ఈ పదవి ఇవ్వడం ఆనవాయితీ అని,, అరికేపూడి గాంధీ ఇప్పటికీ గులాబీ పార్టీ సభ్యుడు గానే ఉన్నారు అని ఆయన గుర్తు చేశారు. కావాలంటే బీఆర్ఎస్ పార్టీకి .. ఆ కమిటీలో సభ్యులు గా అవకాశం ఇస్తామంటూ ఆఫర్ చేశారు. దీని మీద గులాబీ పార్టీ లో లోపల మండిపడుతోంది.
అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి దీని మీద కోర్టుకు కూడా వెళ్లే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసే ఖర్చులను నిలదీసి బయటపెట్టే అవకాశం కూడా ఉండకపోవచ్చు.. అరికెపూడి గాంధీ ఇప్పటికే నిశ్శబ్ద కాంగ్రెస్ సభ్యుడిగా మారిపోయారు,, కాబట్టి ఆయన నుంచి పెద్దగా ఘర్షణ రాకపోవచ్చు. దీంతో కాంగ్రెస్ పార్టీకి రెండు రకాల లాభాలు వచ్చి పడ్డాయి. క్యాబినెట్ మంత్రి హోదా తమ ఖాతాలోనే పడుతుంది మరియు ప్రభుత్వాన్ని పెద్దగా నిలదీసే అవకాశం కూడా ఉండదు.