తెలంగాణ దివాళా- ఇంకా సాక్ష్యం కావాలా?
సంపన్న రాష్ట్రంలో సీన్ మారింది. విద్యార్థుల ఫీజులు, వగైరా చెల్లింపులు, ఆరోగ్యశ్రీ బిల్లులు, కాంట్రాక్టర్ల బిల్లులు సమస్తం పెండింగులో ఉన్నాయి. ఖజానాలో నిధులు లేక చెల్లింపులు ఆగిపోయాయి. అప్పులు 4 లక్షల కోట్లు దాటాయి. అయినా పాత సచివాలయం కూల్చివేత, ఆ తర్వాత కొత్త సచివాలయం కట్టివేత పనులు మాత్రం నిధుల కొరత ఆటంకం లేకుండా నిరాటంకంగా నడుస్తున్నాయి.
ఇప్పుడు అంగన్ వాడీల్లో గర్భిణులు, పిల్లలకు పోషకాహారం లభించడం లేదు. పాలు గుడ్లు, పప్పు, బాలామృతం చాలా చోట్ల సరఫరా కావడం లేదు. నాలుగు నెలలుగా ప్రభుత్వం పాలు, నూనె సరఫరా చేయడం లేదని, కానీ మేమే సరుకులను తింటున్నాం అని కొందరు బద్నాం చేస్తున్నారంటూ అంగన్ వాడీ కార్యకర్తలు బాధపడుతున్నారు. నెలల తరబడి పాలు తాగడం లేదు ఈ సెంటర్లలోని పిల్లలు. గర్భిణులు, బాలింతలకు కూడా అందాల్సినవి సరిగ్గా అందడం లేదు. ప్రభుత్వం ఇచ్చే రేట్లకు సరఫరా చేయలేం అంటున్నారు కాంట్రాక్టర్లు. సహేతుకమైన ధర నిర్ణయించి టెండర్లను ఖరారు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది.
భావి పౌరులు ఆరోగ్యవంతులుగా పెరగడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. చిన్నపిల్లలకు రోజూ గ్లాస్ పాలు, పప్పు, కూర, కోడిగుడ్డుతో భోజనం, 20 గ్రాముల స్నాక్స్, బాలామృతం అందించాలి. ఆనీ అది జరగడం లేదు. నేషనల్ హెల్త్ మిషన్, ఇతర పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులను పంపుతుంది. అయినా, తెలంగాణలో ఈ దుస్థితి ఎందుకు అనేది ప్రశ్న.