తెలంగాణ ఆగమైపోయిందా?
సంపన్న రాష్ట్రం. బంగారు తెలంగాణ. ఈ మాటలకూ వాస్తవానికి చాలా తేడా ఉంది. స్వయంగా 15వ ఆర్థిక సంఘం వెల్లడించిన గణాంకాలను చదివితే మతి పోతుంది. భయమైతుంది. తెలంగాణ ప్రజల దుస్థితికి గుండె చెరువవుతుంది. అప్పులు కొండలా పెరిగిపోవడం ప్రజలపై మోయలేని భారంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ గుదిబండలా మారే ప్రమాదం పొంచి ఉంది. యూజర్ చార్జీల రూపంలో అయినా నిర్వహణ ఖర్చలను రాబట్టుకోకపోతే ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకం అనే హెచ్చరికను కెసిఆర్ ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రభుత్వ ప్రాధాన్య రంగాల్లో అతి ముఖ్యమైంది ఆరోగ్యం. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. సౌకర్యాలు కల్పించడానికి నిధులు అందుబాటులో ఉంటాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ప్రజారోగ్యాన్ని పట్టించుకునే విషయంలో చాలా వెనుకబడింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫైనాన్స్ కమిషన్ నివేదికలో ఆందోళనకరమైన వాస్తవాలు కనిపిస్తున్నాయి.
ఐటి, ఇతర రంగాల్లో తెలంగాణ దూసుకుపోతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. మరో వైపు నిరుద్యోగంలో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. ఇది చాలా ఆందోళనకరమైన పరిణామం. తెలంగాణాలో ఆరోగ్య శాఖకు అతి తక్కువ నిధులు ఇవ్వడాన్ని 15వ ఆర్థిక సంఘం తప్పు పట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో 33 వేల మందికి ఒక డాక్టర్ మాత్రమే ఉన్నారని కూడా తెలిపింది. వైద్యారోగ్య విభాగం ఇలా ఉంటే ఇక ప్రజల ఆరోగ్యానికి భరోసా ఎలా ఉంటుందనేది ప్రశ్న. అలాగే అప్పులు పెరుగుతున్నాయి. నీటిపారుదల శాఖలో భారీగా నిధుల ఖర్చును చూపిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. కానీ అంతఖర్చుకు సార్థకత ప్రశ్నార్థకంగా ఉంది.
ఆర్థిక సంఘం నివేదిక రాకముందే అసలు వాస్తవాలు చాలా వరకు అందరికీ తెలిసివచ్చాయి. సంపన్న రాష్ట్రంలో సీన్ మారింది. విద్యార్థుల ఫీజులు, వగైరా చెల్లింపులు, ఆరోగ్యశ్రీ బిల్లులు, కాంట్రాక్టర్ల బిల్లులు సమస్తం పెండింగులో ఉన్నాయి. ఖజానాలో నిధులు లేక చెల్లింపులు ఆగిపోయాయి. అప్పులు 4 లక్షల కోట్లు దాటాయి. అయినా పాత సచివాలయం కూల్చివేత, ఆ తర్వాత కొత్త సచివాలయం కట్టివేత పనులు మాత్రం నిధుల కొరత ఆటంకం లేకుండా నిరాటంకంగా నడుస్తున్నాయి.
ఇప్పుడు అంగన్ వాడీల్లో గర్భిణులు, పిల్లలకు పోషకాహారం లభించడం లేదు. పాలు గుడ్లు, పప్పు, బాలామృతం చాలా చోట్ల సరఫరా కావడం లేదు. నాలుగు నెలలుగా ప్రభుత్వం పాలు, నూనె సరఫరా చేయడం లేదని, కానీ మేమే సరుకులను తింటున్నాం అని కొందరు బద్నాం చేస్తున్నారంటూ అంగన్ వాడీ కార్యకర్తలు బాధపడుతున్నారు. నెలల తరబడి పాలు తాగడం లేదు ఈ సెంటర్లలోని పిల్లలు. గర్భిణులు, బాలింతలకు కూడా అందాల్సినవి సరిగ్గా అందడం లేదు. ప్రభుత్వం ఇచ్చే రేట్లకు సరఫరా చేయలేం అంటున్నారు కాంట్రాక్టర్లు. సహేతుకమైన ధర నిర్ణయించి టెండర్లను ఖరారు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది.
భావి పౌరులు ఆరోగ్యవంతులుగా పెరగడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. చిన్నపిల్లలకు రోజూ గ్లాస్ పాలు, పప్పు, కూర, కోడిగుడ్డుతో భోజనం, 20 గ్రాముల స్నాక్స్, బాలామృతం అందించాలి. ఆనీ అది జరగడం లేదు. నేషనల్ హెల్త్ మిషన్, ఇతర పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులను పంపుతుంది. అయినా, తెలంగాణలో ఈ దుస్థితి ఎందుకు అనేది ప్రశ్న.