తెలంగాణ… 47 ఏండ్లు ఎన్కకేనా!!!!
ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై నిరసనలు భగ్గుమన్నాయి. ముష్టి 7.5 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేయడంపై ఉద్యోగులు రగిలిపోతున్నారు. కనీసం 60 శాతం ఇవ్వాలంటూ బుధవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కొందరు ఉద్యోగులు ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఎప్పుడు 47 ఏండ్ల క్రితం, 1974లో ప్రభుత్వం 7.5 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిందట. ఆ తర్వాత ఎప్పుడూ ఇంత తక్కువ ఫిట్ మెంట్ ఇవ్వలేదట. ఇప్పుడు బంగారు తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వమే ఇంత తక్కువ ఇచ్చిందని మండిపడ్డారు.
కెసిఆర్ సీఎం అయిన తర్వాత తొలిసారి ఉద్యోగులు 35 శాతం ఫిట్ మెంట్ అడిగితే ఠాట్ గదేం సరిపోతది. మనది సంపన్నరాష్ట్రని కల్వకుంట్ల దొరగారు 43 శాతం ప్రకటిచారు. చప్పట్లు హర్షధ్వానాలతో భళిరా భళిరా భళి అనిపించుకున్నారు. దొరగారి ప్రతిభాపాటవాలకు తెలంగాణ దివాళా తీసే స్థితికి చేరింది. అప్పులు కొండలా పెరిగి 4 లక్షల కోట్ల రూపాయలు దాటాయి. చాలా చాలా బిల్లులు పెండింగులోఉన్నాయి. కరోనా పేరుతో మూడు నెలలు జీతాల్లో అడ్డంగా కోత పెట్టారు. ఇప్పుడు ఫిట్ మెంట్ విషయంలో కమిటీ సిఫార్సును పట్టించుకోకుండా 60 శాతం ఇవ్వాలనేది ఉద్యోగుల డిమాండ్. ఇంతకీ పిఆర్ సి కమిటీ కీలక సిఫార్సులు ఏమిటో చూద్దాం. అదే జరిగితే బంగారు తెలంగాణ 1974 స్థాయికి వెనక్కి పోయినట్టే అంటున్నారు ప్రతిపక్ష నాయకులు.
మూల వేతనంపై 7.5 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. ఉద్యోగుల కనీస వేతనం ఇకమీదట రూ. 19 వేలు ఉండాలని ప్రతిపాదించింది. అత్యధికంగా లక్షా 62 వేల 70 రూపాయల వరకు వేతనం ఉండొచ్చని సిఫార్సు చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లకు పెంచాలి. హెచ్చార్సీ తగ్గించాలి. గ్రాట్యుటీ పరిమితి రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షలకు పెంచాలి. శిశ సంరక్షణ సెలవులు 90రోజుల నుంచి 120 రోజులకు పెంచాలి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్)లో ప్రభుత్వ వాటాను 14 శాతానికి పెంచాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది.