ఐపీఎల్ సీజన్ ముగిసింది. కోల్ కతా టీం మరోసారి కప్పు గెలుచుకుంది. ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకుంది. చెపాక్ స్టేడియంలో జరిగిన ఏకపక్షపు ఫైనల్స్ లో హైదరాబాద్ జట్టు పూర్తిగా చతికిల పడింది. మ్యాచ్ ప్రారంభం నుంచి కోల్ కతా ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది . దీంతో సగం ఆట గడిచేసరికి హైదరాబాద్ ఓటమి ఖరారు అయినట్లు అర్థమైంది.
ఫైనల్స్ లో కోల్కతా టీం ఆల్రౌండ్ ప్రతిభ ను ప్రదర్శించింది. తుదిపోరులో సన్రైజర్స్ను 8 వికెట్ల తేడాతో ఓడించి అఖండ విజయం సాధించింది. స్టార్క్ (2/14), రస్సెల్ (3/19), హర్షిత్ (2/24) దెబ్బకు హైదరాబాద్ కుదేలవగా తర్వాత 114 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 10.3 ఓవర్లలోనే ఊదేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే చేతులెత్తేసింది. తర్వాత నుంచి హైదరాబాద్ జట్టు కుంటి నడకతోనే సాగింది దీంతో మ్యాచ్ ఏకపక్షంగా ముగిసినట్లు అయింది.
ఇక లీగ్ దశ ఆరంభం నుంచీ జట్టు వెన్నంటే ఉంటూ పూర్తి సపోర్ట్గా నిలిచిన ఆరెంజ్ ఆర్మీ యజమాని కావ్య మారన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జట్టు ఓటమితో కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా.. కెమెరా కంట పడకుండా వెనక్కి తిరిగి తన కన్నీళ్లను తుడుచుకుంటూ చప్పట్లు కొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గామారాయి.
కావ్య కన్నీరు పేరుతో ఫోటోలు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి ఐపీఎల్ సీజన్ క్లైమాక్స్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.