ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను టార్గెట్ చేస్తూ కొత్త ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసే స్థితికి వెళ్లిపోయిందని టిడిపి సర్కార్ భావిస్తోంది. ఇందుకు కారణం జగన్ అనుసరించిన అస్తవ్యస్త విధానాలే అని చెబుతున్నారు. అందుచేత జగన్ చేసిన తప్పులను నేరుగా ప్రజల ముందు ఉంచాలని ఆలోచిస్తున్నారు.
ఇందుకు మరొక కారణం కూడా ఉంది. అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు అనేక వరాలు ఇప్పించారు ఇందులో సూపర్ సిక్స్ అనేది చాలా ముఖ్యమైనది. మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది. కుటుంబంలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి 15000 చొప్పున తల్లి అకౌంట్లో వేయాలి. రైతులకు వ్యవసాయం చేసుకునేందుకు ఏడాదికి 20,000 అందించాల్సి ఉంటుంది. 20 లక్షల మంది నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తామని లేని పక్షంలో ప్రతినెల 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. ఈ హామీలన్నీ నెరవేర్చాలి మరియు ఇప్పుడు అమలవుతున్న పింఛన్లను కొనసాగించాలి. పెన్షన్ మొత్తం నాలుగు వేలుకు పెంచుతామని బీసీలకు 50 సంవత్సరాల నుంచి పింఛను అమలు చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. ఒక అంచనా ప్రకారం ఈ పనులన్నీ చేయాలి అంటే ఇప్పుడు అవుతున్న బడ్జెట్ కు దాదాపు రెట్టింపు ఖర్చ ఏర్పడుతుందిు
అటువంటి అప్పుడు వెంటనే అన్ని హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయలేని పరిస్థితి. అలా అని ఆలస్యం చేస్తే ప్రతిపక్షాలు విమర్శలకు దిగే అవకాశం ఉంది. అందుచేత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు తెలియజేయడం ద్వారా కొంత సమయం కోరే వెసులుబాటు కలుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాస్తవ ఆర్థికచిత్రాన్ని ప్రజల ముందు పెట్టేందుకు శ్వేత పత్రాలు వెలువరించాలని. తెలుగు దేశం ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకు అవసరమైన కసరత్తు కూడా ప్రారంభమైంది.
గడిచిన ఐదేళ్లలో ఆర్థిక శాఖలో చోటు చేసుకున్న అనేక అవకతవకల్ని, అప్పుల్ని లోతుల్లోకి వెళ్లి వెలికి తీయాలని నిర్ణయించారు.
ఇందుకు ఎవరెవరు కసరత్తు చేయాలో ఇప్పటికే నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నియమితులైన పయ్యావుల కేశవ్ ఈ విషయం వెల్లడించారు. ఆర్థికశాఖకు సంబంధించే నాలుగు శ్వేతపత్రాలు వెలువరించాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో మొత్తం ఎన్ని అప్పులు తీసుకున్నారో లెక్క తేలుస్తున్నారు. దీంతోపాటు కార్పొరేషన్ల ద్వారానే ఏ స్థాయి అప్పులు చేశారు? ఆ అప్పులను వేటికి వెచ్చించారు? ఈ రూపంలో అప్పులు చేసేందుకు ఏయే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారనే అంశాలను లోతుగా శోధించనున్నారు.
మొత్తం మీద తప్పులన్నీ మూటకట్టి జగన్ నెత్తిన పెట్టినట్లయితే ఇక రాజకీయంగాను అటు పరిపాలనా పరంగాను కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇందుకు తగినట్లుగా శ్వేత పత్రాలను ప్రధాన మీడియా మరియు డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకొని వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.