ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు వాడి వేడిగానే ఉంటాయి. శత్రువుని టార్గెట్ చేసుకుని పార్టీలు, ప్లాట్ ఫామ్ లు మార్చుకోవడం నాయకులకు అలవాటైపోయింది. ఏపీ రాజకీయాల్లో వైయస్ షర్మిల కూడా ఇదే బాట అవలంబిస్తున్నారు అన్నయ్య వైయస్ జగన్ ను ముప్పు తిప్పలు పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు హోదాలో కూడా ఆమె స్పష్టమైన టార్గెట్ తో ముందుకు వెళుతున్నారు. ఇక్కడే కొత్త ట్విస్టు చోటు చేసుకుంటున్నది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ కు దగ్గర అవ్వడానికి వైయస్ జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. బెంగళూరు వేదికగా జగన్ తరచూ కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అవుతున్నారనీ, ఆ భేటీల్లో కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ప్రతిపాదన తీసుకు వచ్చారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి బలం చేకూర్చే విధంగానే జగన్ చర్యలు, ప్రకటనలు కూడా ఉంటున్నాయి.
రాజ్యసభలో బీజేపీకి వ్యతిరేక స్టాండ్ తీసుకోవడం నుంచి ఆయన వరుసగా వేస్తున్న అడుగులు కాంగ్రెస్ తో ఒప్పందం లేదా పొత్తు స్థాయిని దాటి విలీనం దాకా వెళ్లాయని కూడా వైసీపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ పరిస్థితిని గమనించి వైయస్ షర్మిల తనదైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అందుకే ఆమె విమర్శల దాడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ పై కాకుండా కనీసం విపక్ష హోదా కూడా లేని తన అన్న పార్టీ వైసీపీ మీదనే ఎక్కువగా ఉంటోందని అంటున్నారు. దీంతో ఆమె చేస్తున్న రాజకీయం రాష్ట్రంలో కాంగ్రెస్ కు కాకుండా తెలుగుదేశం కు ప్రయోజనం కలిగేలా ఉంటున్నది. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు రహస్యంగా కాదు బాహాటంగానే చెబుతున్నాయి.
ఇటీవల అచ్యుతాపురం ప్రమాదం విషయంలో షర్మిల విమర్శలన్నీ వైసీపీ టార్గెట్ గానే ఉండటాన్ని కాంగ్రెస్ వర్గాలు ఉటంకిస్తున్నాయి. అచ్యుతాపురం ప్రమాదం విషయంలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. తమ ప్రభుత్వం వచ్చి రెండు నెలలే అయింది,గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకమే ఈ ప్రమాదానికి కారణమని తెలుగుదేశం ఆరోపిస్తుంటే, వైసీపీ తమ ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాదాన్ని ఎలా హ్యాండిల్ చేశామో గుర్తు తెచ్చుకోండి అంటూ తెలుగుదేశం తక్షణ స్పందన విషయంలో ఘోరంగా విఫలమైందని విమర్శలు గుప్పిస్తున్నది.
ఈ మధ్యలో షర్మిల తన నోటికి పని చెప్పారు. అచ్చుతాపురం ప్రమాదం జరగడానికి గత వైసీపీ సర్కార్ నిర్వాకమే కారణమని కుండబద్దలు కొట్టేశారు. షర్మిల తీసుకున్న ఈ స్టాండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కావడానికి ఏ మేరకు దోహదపడుతుందో తెలియదు కానీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మాత్రం గట్టి రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది.
దీనివల్ల షర్మిలకు రెండు రకాల ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి వైయస్ జగన్ దగ్గరకాకుండా చూసుకోవడం, ఏపీ రాజకీయాలు వైఎస్ జగన్ ను దోషిగా నుంచో పెట్టడం. ఫలితంగా టార్గెట్ ను నేరుగా కొట్టగలిగేందుకు షర్మిలకు వీలు కలుగుతుంది. అందుచేతనే షర్మిల ఈ మార్గం ఎంచుకున్నారు అని తెలుస్తుంది.