గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గులాబీ పార్టీని ఖాళీ చేయించేందుకు కాంగ్రెస్ పెద్దలు పట్టుదలగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పెద్దలకు టచ్ లోకి వచ్చేసారు. త్వరలోనే ఆపరేషన్ ఆకర్ష షురూ అవుతుందని గాంధీభవన్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.
వాస్తవానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అంతట కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ లభించింది. అన్ని జిల్లాల్లోనూ ఎక్కువ సంఖ్యలో సీట్లను గెలుచుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కానీ జంట నగరాలు మాత్రం హస్తం పార్టీకి కొరుకుడు పడలేదు. పాతబస్తిని మినహాయిస్తే మిగిలిన నగరం అంతా గులాబీ జెండా రెపరెపలాడింది. దీంతో జంట నగరాల్లో గులాబీ పట్టు అలాగే కొనసాగుతోంది.
కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. జంట నగరాల్లోని ఎమ్మెల్యేలు అందరూ భూకబ్జాలు ఆక్రమణలు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. ఎమ్మెల్యే ల వ్యాపారాలకు సంబంధించి చాలా లొసుగులు ఉంటాయనేది అక్షర సత్యం. అందుకే 2014లో అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం ఈ లెక్కల చిక్కులు బయటకు తీసింది. దాంతో జంట నగరాల్లోని ఇతర పార్టీలు ఎమ్మెల్యేలు హడావిడిగా బ్యాగులు సర్దుకుని బి ఆర్ ఎస్ పార్టీలో చేరిపోయారు. అప్పటినుంచి కలిసికట్టుగా ప్రయాణం సాగిస్తున్నారు.
ఇప్పుడు సరిగ్గా కాంగ్రెస్ పార్టీ కూడా అదే మార్గాన్ని ఎంచుకుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇఃదుకు తగినట్లుగా.. మాజీమంత్రి మల్లారెడ్డి సంబంధించిన భూములు వివాదాలు డొంకలకుదురుతున్నాయి. ఈ సెగలో పక్కనే ఉన్న ఉప్పల్ నియోజకవర్గం కూడా పాకింది. దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రజలకు టచ్ లోకి వెళ్లిపోయారు. అలాగే హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు కూడా గాంధీభవనకు రాయబారాలు పంపిస్తున్నారు. దీంతో ఎక్కువ సంఖ్యలోనే గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో కలిసిపోవడం ఖాయం అంటున్నారు.
ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. జంట నగరాల్లోని గులాబీ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది మొదట్లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయాలు చేసినవారు. ఈ నాయకులకు అప్పట్లోనే రేవంత్ రెడ్డి ఆయన చుట్టూ ఉన్న సన్నిహితులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నది కూడా అలనాటి తెలుగుదేశం బ్యాచ్ అనటంలో సందేహం లేదు. దీంతో ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుకోవడం చాలా తేలికగా కనిపిస్తుంది.
అన్నీ కలిసి వస్తే వచ్చే అసెంబ్లీ సమావేశాలు లాగానే చేరికలు పూర్తయ్యే అవకాశం ఉంది. అప్పుడు హైదరాబాద్ అంతట కాంగ్రెస్ హవా కొనసాగుతుంది ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు వెళ్ళినట్లయితే బలం పూర్తిగా సుస్థిరం అవుతుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు.