ప్రపంచ దేశాలలో భారత సైనిక బలగాల సత్తా చాటేందుకు తరంగ శక్తి కార్యక్రమాన్ని సంకల్పించారు. అభివృద్ధి చెందిన దేశాల తో పాటుగా భారత సైనిక బలగాలు అయిన వాయిసేన, నౌకా సేన ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటున్నాయి. శత్రు దేశాలైన పాకిస్తాన్ చైనా వంటి దేశాలు కు కళ్ళు కుట్టే విధంగా భారత్ విన్యాసాలు ఉండబోతున్నాయి.
ఈ తరంగ్ శక్తి కార్యక్రమానికి భారత దేశమే ఆతిథ్యం ఇస్తుండటం ఒక విశేషం. ఈ నెల 6వ తేదీ నుంచి రెండు దశల్లో జరిగే తరంగ్శక్తి యుద్ధ విన్యాసాలు తమిళనాడులోని సూలూరులో జరగనున్నాయి. ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆధ్వర్యంలో భారత నౌకాదళ సహకారంతో ప్రారంభం కానున్న విన్యాసాల్లో 30 దేశాలకు పైగా పాల్గొంటున్నాయి.
వివిధ దేశాలు కలిసికట్టుగా విన్యాసాలు చేయడం ఎప్పటినుంచో ఉన్న సాంప్రదాయం. భారత రక్షణ వ్యవస్థ సత్తా ప్రపంచానికి చాటేలా త్రివిధ దళాల సమన్వయం ఎలా ఉంటుందో శత్రు దేశాలకు తెలియజేసేలా విన్యాసాలు చేస్తారు. భాగస్వామ్య దేశాల మధ్య పరస్పర సహకారం మరింత పెంపొందేలా ‘తరంగ్ శక్తి’ యుద్ధ విన్యాసాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. భారత వాయుసేన, ఆర్మీ, ఇండియన్ నేవీ కలిసి నిర్వహిస్తున్న అంతర్జాతీయ విన్యాసాలకు 30కి పైగా దేశాలు హాజరవుతున్నాయి.
వివిధ దేశాలకు చెందిన బలగాలు ఇప్పటికే భారత్ కు చేరుకున్నాయి.
మొదటి దశ ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకూ తమిళనాడులో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకూ రాజస్థాన్లోని జో«ధ్పూర్లో రెండో దశ విన్యాసాలు జరగనున్నాయి. భారత త్రివిధ దళాల అధిపతులతో పాటు జర్మనీ, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెన్యా, జపాన్, నేపాల్, గినియా దేశాలకు చెందిన చీఫ్ ఆఫ్ ఎయిర్స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ విన్యాసాలకు రష్యా, ఇజ్రాయిల్ దూరంగా ఉంటున్నాయి.
ఈ విన్యాసాల్లో స్పష్టమైన షెడ్యూల్ రూపొందించారు.
తొలి దశలో భారత నౌకాదళం
తమిళనాడులో జరిగే ఫేజ్–1 విన్యాసాల్లో భారత నౌకాదళం ప్రాతినిధ్యం వహిస్తోంది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరిగే విన్యాసాల్లో యుద్ధ నౌకలపై హెలికాప్టర్ల ల్యాండింగ్, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లపై మిగ్–29, రాఫెల్ యుద్ధ విమానాల ల్యాండింగ్, ఫైరింగ్ తదితర విన్యాసాలు నిర్వహించనున్నారు. రక్షణ రంగంలో స్వావలంబన, అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు తరంగ్ శక్తి కీలకంగా మారనుంది.
మరోవైపు,, ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఈ విన్యాసాల్లో సత్తా చాటనుంది. ఎల్సీఏ తేజస్ యుద్ధ విమానాలు, రాఫెల్, మిరాజ్ 2000, ఎల్సీహెచ్ ప్రచండ్, ధృవ్, రుద్ర, జాగ్వర్, మిగ్–29, సీ–130, ఐఎల్–78 తదితర యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.
మొత్తం మీద అభివృద్ధి చెందిన దేశాలతో కలిసి ఇటువంటి విన్యాసాలు చేయడం ద్వారా భారతదేశం సైనిక సామర్థ్యం అందరికీ వెల్లడి అవుతుంది. తద్వారా దేశాల మధ్య సంబంధాల విషయంలో పటిష్టమైన బాటలు ఏర్పడతాయి అని భావిస్తున్నారు.