తమ భాష సంస్కృతులు, కట్టుబొట్టు, ఆచార వ్యవహారాలంటే ప్రాణం పెట్టే తమిళనాడులో మరోసారి వివాదం రాజుకుంది. పాలఉత్పత్తులపై హిందీలోనే పేర్లుండాలనే ఉత్తర్వులపై తమిళులు మండిపడ్డారు. ఏకంగా స్టాలిన్ ఎంటరవడంతో విషయం వివాదాస్పదం అయింది. అయితే గొడవ తీవ్రరూపం దాల్చకముందే ఆహారభద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ వెనక్కి తగ్గింది. ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటూ ప్రాంతీయ భాషల ఉనికి గౌరవిస్తామని, ప్రమోట్ చేస్తామని స్పష్టం చేయాల్సి వచ్చింది.
భాష విషయంలో తమిళనాట వివాదాలు కొత్తేంకాదు. తాజాగా పెరుగు ప్యాకెట్లపై ఇంగ్లిష్, తమిళ పేర్లు తొలగించి హిందీలో దహి అని వేయాలంటూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI తమిళనాడు మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్కు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఇతర డైరీ ఉత్పత్తులపైనా హిందూ పేర్లు వాడాలంది. ఈ ఉత్తర్వులతో తమిళులు భగ్గుమన్నారు. సాక్షాత్తూ సీఎం స్టాలిన్ రంగంలోకి దిగారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. చివరకు పెరుగు ప్యాకెట్లపైనా సొంతభాషల్ని రాసుకోనీయకుండా హిందీలో రాయమంటున్నారని ….దీని వెనక ఉన్న వాళ్లను దక్షిణభారతం మొత్తం బహిష్కరిస్తుందని ట్వీట్ చేశారు.
తమిళనాడులో హిందీకి చోటే లేదన్నారు. అయితే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సైతం FSSAI నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ప్రాంతీయ భాషాలను ప్రోత్సహించాలన్న ప్రధాని మోడీ విధానాలకు ఇది విరుద్ధంగా ఉందని… ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని లేఖ రాశారు. అయితే వివాదాల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెనక్కి తగ్గారు. పెరుగు పేరు మార్పుపై ఉత్తర్వులను సవరిస్తూఇంగ్లిష్ తో పాటు స్థానిక భాషల పేర్లు పెట్టుకోవచ్చంటూ స్పష్టం చేశారు.