ఆసక్తికరంగా మారనున్న తమిళనాడు ఎన్నికలు.. రీజన్ ఇదే
తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే-డీఎంకే కూటముల మధ్య తీవ్ర పోటీ ఉన్న సంగతి తెలిసిందే. మళ్లీ ఎలాగైన అధికారం చేపట్టాలని అన్నాడీఎంకే కూటమి పక్కా ప్లాన్లు వేస్తోంది. అయితే డీఎంకే కూడా అదే రేంజ్లో ప్రచారం చేపడుతోంది. ముఖ్యంగా మైనార్టీ ఓట్లను తమ వైపు మరల్చుకునేందుకు డీఎంకే ప్లాన్ వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే డీఎంకే ఆశలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నీళ్లు చల్లారు. త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటికి దిగుతుందని ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఓవైసీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే మహారాష్ట్ర,బీహార్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడమే కాకుండా.. కొన్ని స్థానాలను కూడా గెల్చుకున్నామని తెలిపారు. అంతేకాదు.. ఇటీవల జరిగిన గుజరాత్ స్థానిక ఎన్నికల్లో కూడా ఎంఐంఎం రంగంలోకి దిగి కొన్ని స్థానాలను గెల్చుకుంది. అయితే ఇదే ఊపును త్వరలో జరగబోయే తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో కూడా చూపేందుకు తహతహలాడుతోంది.కాగా, తమిళనాడులో ఏప్రిల్ 6వ తేదీన ఒకే దశలో ఎన్నికలు జరుగనున్నాయి.