ఔనా! తమిళనాడు బిజెపి కి కెసిఆర్ నిధులిస్తారా?
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తమిళనాడులో బిజెపి ఎన్నికల నిధులు సమకూరుస్తారట. ఇది ఓ కాంగ్రెస్ ఎంపి చేసిన ఆరోపణ. ఆయన పేరు రేవంత్ రెడ్డి. కేసుల భయం చూపించి కెసిఆర్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లొంగదీసుకున్నారని ఆరోపించారు. బిజెపికి సహకరించడానికి ఇటీవల ఢిల్లీ పర్యటనలో కెసిఆర్ ఒప్పుకొన్నారని కూడా రేవంత్ మరో ఆరోపణ చేశారు. తమిళనాడు బిజెపి ఇంచార్జిగా కిషన్ రెడ్డిని నియమించడం వెనుక కెసిఆర్ ప్రోద్బలం ఉందట. కెసిఆర్ ఎప్పటికప్పడు ఇంటెలిజెన్స్ ద్వారా తమిళనాడుపై నివేదికలు తెప్పించుకుంటున్నారట.
తమిళనాడు బిజెపికి కెసిఆర్ నిధులు సమకూర్చ బోతుండటంపై దర్యాప్తు జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిస్తే కుమ్మక్కు అయినట్టే అనే విధంగా ఆయన మాట్లాడారు. ఇంతా చేసి, ఆయన కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కోరారు. అంటే ఆయన కూడా బిజెపితో కుమ్మక్కు అయినట్టు భావించాలా అని గిట్టని వారు ప్రశ్నిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికారని రేవంత్ రెడ్డిమీద కేసు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.