ఠాగూర్ సినిమా గుర్తుంది కదా. అందులో ఒక సీన్ బాగా పాపులర్ అయింది. చనిపోయిన ఒక వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ సిబ్బంది డ్రామా చేస్తారు. అత్యవసర చికిత్స అంటూ డబ్బులు గుంజేస్తారు . చివరికి మృతదేహాన్ని అప్పగించి చేతులు దులుపుకుంటారు.
అచ్చు గుద్దినట్లు అటువంటి సీన్ హైదరాబాదులో రిపీట్ అయింది. చిన్న తేడా ఏమిటంటే చనిపోయాడు అన్న విషయాన్ని మరో ఆసుపత్రికి తీసుకెళ్తే తప్ప తెలియలేదు.
బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. పరిగి సమీపంలోని సుల్తాన్పూర్కు చెందిన మల్లయ్య పెద్ద కుమారుడు డి.విజయ్కుమార్ డిగ్రీ చదువుతున్నాడు. అతనికి తలలో సమస్య ఉందని స్థానిక వైద్యుడు చెప్పడంతో ఏప్రిల్ 2న కేపీహెచ్బీ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.
ఆసుపత్రి యాజమాన్యం మొదట రూ.2.5లక్షల ప్యాకేజీ అని చెప్పి ఆపరేషన్ చేశారు. తర్వాత మరో రెండు శస్త్రచికిత్సలు చేశారు. కుటుంబసభ్యులు అడిగినప్పుడల్లా మెల్లగా కోలుకుంటాడని వైద్యులు తెలిపారు. చాలారోజులు కావడంతో సందేహం వచ్చి బంజారాహిల్స్లోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బ్రెయిన్డెడ్ అయినట్లు తేలింది.
దీంతో విజయ్కుమార్ బంధువులు, గ్రామస్థులు కేపీహెచ్బీలోని ప్రైవేటు ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని సముదాయించడంతో ఆందోళనను విరమించారు. ఈ విషయమై ఆసుపత్రి యాజమాన్యం వివరణ మరోలా ఉంది. విజయ్కుమార్ వచ్చిన సమయంలో స్పృహ లేదని, సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. తలకు మూడుసార్లు శస్త్రచికిత్స చేశామని, మిగతా అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకడంతోనే ఇన్ని రోజులు ఉంచుకున్నామని చెబుతున్నారు.
మొత్తం మీద విజయ్ కుమార్ మరణంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. వైద్య చికిత్సకు 15 లక్షల ఖర్చు పెట్టామని, కుటుంబం మొత్తం రోడ్డున పడిందని వాపోతున్నారు.