బడ్జెట్ సమావేశాల తొలిరోజే గందరగోళం. విపక్ష బీజేపీ సభ్యుల సస్పెన్షన్ తో ఈ సెషన్ మొదలైంది. ఎన్నడూ లేనిది మొదటిసారి గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. అయితే సంప్రదాయానికి విరుద్ధంగా గవర్నర్ ప్రసంగం లేకుండా సభ ఏంటంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. బడ్జెట్ ప్రసంగానికి అడ్డుతగులుతున్న బీజేపీ సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో ఆ పార్టీ సభ్యులు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్ లను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ పోచారం ప్రకటించారు. అయితే తమ సస్పెన్షన్ కు నిరసనగా సభ్యులు అసెంబ్లీ బయట నల్ల కండువాలతో నిరసనకు దిగారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. తమను అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు లేదని అసెంబ్లీ ప్రాంగణంలో తమను మార్షల్స్ మాత్రమే అరెస్ట్ చేయగలరని వారన్నారు. అయినా బలవంతంగా అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్ కు తరలించారు. తమ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఏసీపీ వెంకటరెడ్డిని సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. తమ హక్కులు హరిస్తున్నారంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంపైనా వారు మండిపడ్డారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)