వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ అంశంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే ఇచ్చింది. ఈనెల 25 వరకూ అవినాష్ ను అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీం మెట్లెక్కారు. సీజేఏ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం ధర్మాసనం తప్పుపట్టింది. అవినాష్ కు ముందస్తు బెయిల్ ఇస్తే కేసు విచారణపై దాని ప్రభావం పడుతుందని సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో ఈనెల 24న పూర్తిస్థాయి విచారణ చేపడతామని అప్పటివరకు ఆయన్ని అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. అయితే ఈనెల 30 లోపు కేసు విచారణ పూర్తిచేయాలంటూ గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను పొడిగిస్తామని తాజాగా సుప్రీం తెలిపింది.
అటు మూడోరోజూ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించింది. దాదాపు ఆరుగంటల పాటు ఆయన్ని అధికారులు ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో నిందితులైన భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను ఈనెల 24 వరకు విచారించేందుకు సీబీఐ కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. డిల్లీ సీబీఐ విభాగానికి చెందిన వికాస్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు అధికారుల బృందం ముగ్గురు నిందితులనూవిచారిస్తోంది.