ఉత్తరాఖండ్ హల్ద్వానీ కూల్చివేతల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రైల్వే భూమిలో అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ హైకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. రాత్రికి రాత్రే 50 వేల మందిని వెళ్లగొట్టకూడదని స్పష్టం చేసింది. బన్భూల పూరాలో 29 ఎకరాల భూమి తమదేనంటూ రైల్వేశాఖ గతేడాది కోర్టుకు ఎక్కింది. స్థానికులు అక్కడ ఇళ్లు నిర్మించుకున్నారని..వారిని ఖాళీ చేయించాలంటూ ఉత్తరాఖండ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్ట్ అక్కడ కట్టిన అక్రమ కట్టడాలను కూల్చేయాలంటూ గతేడాది డిసెంబర్లో తీర్పునిచ్చింది. అయితే వారం ముందు నోటీసులిచ్చి తొలగించాలంది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అక్కడున్నవాళ్లు సుప్రీంకెళ్లారు. దీంతో హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది.