వారణాశిలో జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో గుర్తించిన శివలింగానికి రక్షణను పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు శివలింగానికి రక్షణ ఉండాలని స్పష్టం చేసింది. జ్ఞానవాపి కేసు విచారణకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయడానికి అత్యున్నత ధర్మాసనం అంగీకరించింది. సుప్రీంకోర్టు పొడిగించిన రక్షణ ఈనెల 12తో ముగియడంతో…శివలింగం ఉంటున్న పరిసరాల్లో భద్రతను పొడిగించాలంటూ హిందూసంఘాలు సుప్రీంలో పిటిషన్ వేశాయి. వీడియోగ్రఫీ సర్వేలో కనుగొన్న శివలింగం ఉంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని గత మే 17న వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. జ్ఞానవాపి మసీదులో ముస్లింలు నమాజు చేసుకునేందుకు కూడా అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది.