మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వివేకాకేసును ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆయన కుమార్తె సునీత వేసిన పిటిషన్ పై సుప్రీం విచారణ జరిపి..ఈ నిర్ణయం తీసుకుంది.
తన తండ్రి హత్య కేసుకు సంబంధించి ఏపీలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు లేదని సునీత సుప్రీంకు విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు పురోగతిని కూడా నేరుగా పర్యవేక్షించాలని ఆమె పిటీషన్ లో పేర్కొంది. దీంతో హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు తదుపరి విచారణను బదిలీ చేస్తున్నట్టు కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఈ కేసుకు సంబంధించి అన్ని పత్రాలు, ఛార్జ్ షీట్, అనుబంధ ఛార్జ్ షీట్ కూడా సీబీఐకి పంపించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసును త్వరితగతిన, స్వతంత్రంగా, నిష్పాక్షికంగా తదుపరి దర్యాప్తు కొనసాగాలని కోర్టు సూచించింది. ఈ కేసులో పెద్ద ఎత్తున నిందితులను విచారించాల్సి ఉంటుంది కాబట్టి హైదరాబాద్ CBIకి పూర్తి సహకారం అందించాలని ఆదేశాలు ఇచ్చింది. బాధితులకు న్యాయం జరుగుతుందని మాత్రమే కాదు న్యాయం జరగాలని కోర్టు చెప్పింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేష్ లతో కూడిన ధర్మాసనం ఈ బదిలీ ఉత్తర్వులు ఇచ్చింది.