
Supreme Court of India
మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద విచారించడం, అరెస్టు చేయడం సహా ఆస్తులను అటాచ్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారాన్ని సుప్రీంకోర్టు ఈరోజు సమర్థించింది. ఈడీ చేపట్టిన అరెస్టు, ఆస్తుల జప్తు, దర్యాప్తు ప్రక్రియను సవాలు చేస్తూ.. పీఎంఎల్ఏ నిబంధనలకు వివరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈడీ అధికారాలకు సంబంధించిన PMLAలోని సెక్షన్లు 5, 8(4), 15, 17 సహా 19 నిబంధనల రాజ్యాంగబద్ధతను కోర్టు సమర్థించింది.
ఎంఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) సహా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) వంటి దర్యాప్తు సంస్థలు “పోలీసులు” కాదని, అందువల్ల విచారణ సమయంలో వారు నమోదు చేసిన వాంగ్మూలాలు చెల్లుబాటు అయ్యే సాక్ష్యాలని బెంచ్ తన తీర్పులో పేర్కొంది.
మనీలాండరింగ్ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో ఈడీ అధికారులు అరెస్టు చేయడానికి గల కారణాలను వెల్లడించడం తప్పనిసరి కాదని కూడా పేర్కొంది. నిందితులకు ఈసీఐఆర్ (ఫిర్యాదు కాపీ) ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది.