ఉత్తరప్రదేశ్లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. రాళ్ళు విసిరిన సంఘటనల్లో నిందితుల అక్రమ ఆస్తులపై బుల్డోజర్తో చర్యలు చేపట్టడాన్ని నిలిపేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కట్టడాల కూల్చివేతలకు ముందు నిర్ణీత విధానాన్ని అనుసరించాలని కోర్టు స్పష్టం చేసింది. అంతా చట్టం ప్రకారం జరగాలని పేర్కొంది. కాగా నూపుర్ శర్మవ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం ప్రార్థనల అనంతరం జరిగిన హింసాకాండ అల్లర్ల కేసుల్లో నిందితుల ఇళ్ళను కూల్చేయడాన్ని ఆపాలంటూ జమియత్ ఉలమా-ఇ-హింద్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
అక్రమ నిర్మాణాల కూల్చివేత చట్ట ప్రకారం జరగాలని, ప్రతీకార ధోరణి ఉండకూడదని సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. తదుపరి విచారణ మంగళవారం జరుగుతుందని, అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై స్పందించాలని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రయాగ్రాజ్, కాన్పూరు పురపాలక సంఘాలకు నోటీసులు ఇచ్చింది.
ఓ మత వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని యోగీ సర్కార్ వ్యవహరిస్తున్నట్టు పిటిషనర్ ఆరోపణలు చేశారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు ప్రారంభించారని ఆరోపించారు. ఏ మత వర్గాన్ని తాము లక్ష్యంగా చేసుకోవడం లేదని యోగి ఆదిత్యనాథ్ సర్కారు సుప్రీంకోర్టుకు తెలిపింది. కూల్చివేత సమయంలో తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది.
ప్రభుత్వానికి తన అభ్యంతరాలను దాఖలు చేయడానికి సమయం ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అదే సమయంలో పిటిషనర్లకు భద్రత కల్పించాల్సిన భాద్యత తమపై ఉందని, వారు కూడా సమాజంలో భాగమేనని తెలిపింది. చట్టం ప్రకారం మాత్రమే కూల్చివేతలు జరగాలని, ప్రతికారాత్మకంగా ఉండకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.