ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను రద్దు చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది. ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది. న్యాయపరంగా ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఉత్తర్వులు ముగిశాయని పేర్కొంటూ.. గతంలో సుప్రీం కోర్టు స్టే విధించిన కారణంగా సస్పెన్షన్ ఉత్తర్వులు కొనసాగాయని, ఆ స్టే కూడా ఫిబ్రవరి 7 వరకే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ను తోసిపుచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఏబీ వెంకటేశ్వరరావు సర్వీసులో ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని పేర్కొంది. అదే తేదీ నుంచి జీతభత్యాల చెల్లింపును వర్తింపజేయాలని ఆదేశించింది.
శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ అభయ్ ఎస్ ఒకాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తుది ఉత్తర్వులు జారీ చేసింది. తీర్పు అనంతరం ఏబీ స్పందిస్తూ… తాను లోకల్ అని, బాధ్యులైన వారిని ఎవరినీ వదలిపెట్టబోనని అన్నారు. అందరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతానని చెప్పారు. సుప్రీం ఉత్తర్వుల ప్రకారం నేను విధుల్లో చేరుతానన్నారు.