దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి ఏజీ పెరరివాళన్ ను విడుదల చేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది సుప్రీం కోర్టు. ఆ కేసులో పెరరివాళన్ ముప్పైఏళ్లకు పైగా జైలుశిక్ష అనుభవించాడు.
జీవిత ఖైదును రద్దు చేయాలంటూ దోషి పెరరివాళన్ వేసిన పిటిషన్పై న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బిఆర్ గవాయ్, ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం విచారణ చేసి, రాజ్యాంగంలోని 142వ అధికరణం ప్రకారం విడుదలకు ఆదేశాలు జారీచేసింది. పెరరివాళన్ విడుదలతో ఈ కేసులో జీవితఖైదు శిక్షను అనుభవిస్తోన్న నళిని, ఆమె భర్త మురుగన్ సహా ఇతరుల విడుదలకూ మార్గం సుగమమైంది.
పెరరివాళన్ విడుదలకు 2016, 2018లో అప్పటి తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసినా కానీ గవర్నర్ తో విభేదాల కారణంగా అది జరగలేదు. ఆ తర్వాత గతేడాది క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతికి పంపాలని గవర్నర్ నిర్ణయించారు. కాగా, పెరరివాళన్ క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతికి పంపాలని గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి రాజ్యాంగపరమైన మద్దతు లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్ తన అధికారాలను వినియోగించకుండా.. రాష్ట్ర కాబినెట్ నిర్ణయాన్ని రాష్ట్రపతికి సిఫార్సు చేయొచ్చా? లేదా? అనేది పరిశీలించాల్సి ఉందని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. 20 ఏళ్ళ శిక్ష పూర్తి చేసిన వారిని విడుదల చేయాలని గతంలో అనేక తీర్పులు ఉన్నాయని.. కావున పెరరివాళన్ విషయంలో మాత్రం వివక్ష చూపడం సరికాదని పేర్కొంది.