నూపుర్ శర్మ వివాదంలో టైమ్స్ నౌ యాంకర్ నవికా కుమార్ పై దాఖలైన ఎఫ్ఐఆర్ లో ఆమెపై బలవంతపు చర్య తీసుకోవద్దని రాష్ట్రాల పోలీసులను నిన్న సుప్రీం కోర్టు ఆదేశించింది. టైమ్స్ నౌలో మే 26న ప్రసారమైన టీవీ చర్చపై నవికా కుమార్ పై పలు ఎఫ్ఐఆర్ లు దాఖలైన విషయం తెలిసిందే.
తనపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ లను రద్దు చేయాలని టైమ్స్ నెట్వర్క్ గ్రూప్ ఎడిటర్ నవికా కుమార్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా, నవికా మహమ్మద్ ప్రవక్త కు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదని, ఆమె కేవలం చర్చకు ఆతిథ్యం ఇస్తోందని న్యాయవాది రోహత్గీ ఎత్తి చూపారు. ఆరోజు టీవీ ఛానల్ లో జ్ఞానవాపి మసీదుపై చర్చ జరుగుతోంది. అకస్మాత్తుగా వక్తలలో ఒకరు ఏదో అన్నారు. ఆపై మరొకరు బదులిచ్చారు. యాంకర్ ఈ విషయంలో ఏమీ మాట్లాడలేదు. అనవసరంగా ఆమెపై అనేక ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని నవిక కుమార్ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు.
వాదనలు విన్న సుప్రీం.. ప్రస్తుతానికి అయితే అరెస్ట్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది.
‘తాత్కాలిక చర్యగా, మే 26 ప్రసారానికి సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్లు, ఫిర్యాదులు లేదా భవిష్యత్ ఎఫ్ఐఆర్లు, ఫిర్యాదుల ప్రకారం పిటిషనర్పై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోరాదని జస్టిస్ క్రిష్ణ మురళి, హిమ కోహ్లీలతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో నుపుర్ శర్మకు జూలైలో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆగస్టు 10 వరకు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించింది.