రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుననుసరించి లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. రేపటి నుంచి పది రోజులపాటు రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించడంతో…. దీని అమలుపై నేడు రాష్ట్రం లోని రేంజ్ ఐజీలు, డీఐజీ లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్లు, ఎస్పీ లనుంచి డీ.ఐ.జీ స్థాయి సీనియర్ పోలీస్ అధికారులందరూ విధిగాక్షేత్ర స్థాయిలో ఉండి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసిన లాక్డౌన్ ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలన్నారు.
హైదరాబాద్ సహా అన్ని ప్రధాన నగరాలు, జిల్లా హెడ్ క్వార్టర్లు, ప్రధాన నగరాలలో నిబంధనలు పటిష్టంగా అమలయ్యేలా చూడాలన్నారు. వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణాలపై ఏ విధమైన ఆంక్షలు లేవని తెలిపారు. జాతీయ రహదారులపై ..రవాణాకు సంబంధించి ఏవిధమైన ఆంక్షలు లేవన్నారు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమ అక్రిడేషన్ కార్డులు, ఇతర గుర్తింపు కార్డులు తమవెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు.
గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత పనులు, ఉపాధిహామీ పనులను లాక్ డౌన్ నుండి మినహాయించిన విషయం తెలిసిందేనని.. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వారి శాఖా పరమైన గుర్తింపు కార్డులుంటే సరిపోతుందని గుర్తుచేశారు.
రాష్ట్రంలో జరిగే వివాహాలకు ఇరువైపుల చెందిన 40 మంది మాత్రమే హాజరయ్యేవిధంగా చూడాలని అన్నారు. వివాహలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలనీ అన్నారు.
వాక్సినేషన్ కు వెళ్లాల్సినవారు వారి మొదటి డోస్ కు సంబంధించిన సమాచారం సెల్ ఫోన్ లో చూసి వారికి సడలింపు ఇవ్వాలని పోలీసులకు ఆదేశించారు. నిత్యావసర వస్తువుల రవాణా సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని, ఇతర ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి స్థానికంగా సమయాలను పేర్కొంటూ ప్రత్యేక పాసులు జారీ చేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టం తో పాటు ఐ.పీ.సి ప్రకారం తగు కేసులు నమోదు చేయాలని మహేందర్ రెడ్డి పోలీస్ అధికారులకు స్పష్టం చేశారు.