ఆఫ్గన్లో ఇస్లామిక్ చట్టాల్ని కఠినంగా అమలుచేసేందుకు తాలిబన్లు సిద్ధమవుతున్నారు. ఉరితీతలు, చేతులు నరకడం వంటి శిక్షలు పునరుద్దరిస్తామని తాలిబన్ పాలకులు స్పష్టం చేశారు. అయితే ఆ శిక్షల్ని బహిరంగంగా అమలుపర్చాలా? వద్దా? అనేదానిపై అధ్యయనం జరుగుతోందన్నారు. తమ పాలనావ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని తాలిబన్ న్యాయశాఖామంత్రి ముల్లానూరుద్దీన్ ఓ వార్తాసంస్థకు తెలిపారు. గతంలో తాలిబన్ల పాలనలో బహిరంగ ఉరితీతల సందర్భంగా పలు విమర్శలు వచ్చాయని…అయితే వాటి గురించి ఇప్పుడు మాట్లాడబోమన్నారు. ఆఫ్ఘనిస్థాన్ చట్టాలకు పునాది ఖురానేనంటున్న తాలిబన్ పాలకులు….వాటిని అమలుచేస్తామన్నారు. అయితే శిక్షలను బహిరంగంగా అమలు చేయాలా? అనే విషయంపై మాత్రం కేబినెట్లో చర్చ జరుగుతుందన్నారు. 1996-2001 మధ్య తాలిబన్ పాలనలో కాబూల్ స్పోర్ట్స్ స్టేడియంలో లేదా ఈద్గా మసీదు మైదానంలో శిక్షలు అమలయ్యేవి. వందలాదిమంది సమక్షంలో ఉరితీసేవారు. లేదా దోషి తలలోకి కాల్చిచంపేవారు. దొంగలకు చేతులు నరికేవారు.