తిలకం, కుంకుమ, బిందీ, సింధూరం వంటి వాటిని పెట్టుకున్న విద్యార్థులను స్కూలు, కాలేజీల్లోకి రానివ్వకుండా అడ్డుకునే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బి నగేష్ హెచ్చరించారు.
“కుంకుమ, సింధూరం, బిందీ మన సాంస్కృతిక గుర్తింపులని, వాటిని ఆభరణాలుగా వాడుకుంటారని అన్నారు. వాటిని మతపరమైన దుస్తులైన హిజాబ్తో పోల్చలేం. హిజాబ్ మతాన్ని సూచిస్తుంది. గాజులు, కుంకుమ కేవలం ఆభరణాలు మాత్రమే’ అని అన్నారు. పాఠశాలలకు ఈ ఆభరణాలు ధరించి రాకూడదని కఠినమైన నిబంధనలు లేవని, విద్యార్థులు స్వచ్ఛందంగా ధరించాలని అన్నారు.
విజయపూర్ జిల్లాలో ఒక విద్యార్థిని కుంకుమ తిలకంతో కళాశాలలోకి ప్రవేశించకుండా అడ్డుకున్న సంఘటన తర్వాత ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటన కర్నాటక వ్యాప్తంగా కలకలం రేపింది. విద్యార్థినిని అడ్డుకున్న ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
హిజాబ్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, విజయపుర జిల్లాలోని ఇండీలో ప్రభుత్వ పీయూసీ కళాశాల అధికారులు తిలకం ధరించిన విద్యార్థిని క్యాంపస్లోకి రాకుండా అడ్డుకున్నారు. కాలేజీలో ప్రవేశించే ముందు బాలుడిని తిలకం తొలగించమని అడిగారు. అయితే అందుకు నిరాకరించినందున విద్యార్థిని ఇంటికి వెళ్లాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనతో కళాశాల వెలుపల బజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ కళాశాలకు, అధ్యాపకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందూ కార్యకర్త, శ్రీరామ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ మాట్లాడుతూ “సింధూరం మత చిహ్నం కాదు, ఇది దేశ సంస్కృతిలో భాగం. మతపరమైన చిహ్నాలపై విద్యా శాఖ సర్క్యులర్కు అనుగుణంగా దీన్ని నిషేధించలేం” అనీ అన్నారు.