హిజాబ్ పై కొందరు అమ్మాయిలు అనవసర రాద్దాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు సుప్రీం కోర్టు న్యాయవాది సుబుహీ ఖాన్. ఫిబ్రవరి 12 న ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యాసంస్థల్లో మూర్ఖంగా హిజాబ్ కోసం పట్టుపట్టడం ఏంటని మండిపడిందామె. కర్నాటక విద్యాహక్కు చట్టం 1983 ప్రకారం ఎప్పటినుంచో విద్యాసంస్థల్లో యూనిఫాం కోడ్ అమల్లోకి ఉన్నప్పుడు కొత్తగా దానికోసం పట్టుబట్టడం ఏంటని ఆమె ప్రశ్నించింది.
ఓ మీడియాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలే చేశారు సుబుహీ ఖాన్. “రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ఎవరైనా సరే తమకు నచ్చిన మతాన్ని ఆచరించవచ్చు. కానీ ఏ హక్కు కూడా సంపూర్ణమైనది కాదు. తమ మతం ప్రకారం దుస్తులను ఎంచుకోవడం తమ హక్కు అని చెప్పుకుంటున్నప్పుడు… అలీఘర్ ,జామియా మిలియా ఇస్లామియాలోని ముస్లిమేతర పిల్లలను షేర్వానీ , సల్వార్ కమీజ్ ధరించమని ఎందుకు బలవంతం చేస్తారు? దీన్ని ద్వంద్వ ప్రమాణం కాక ఇంకేమంటారు అని ఆమె నిలదీశారు.
ప్రతి ఒక్కరికీ వారి వ్యక్తిగత జీవితంలో వారు ఏమి ధరించాలనుకుంటున్నారో ఎంచుకునే హక్కు ఉందని ఆమె అన్నారు. ఇది ముస్లిం మహిళలకు కూడా వర్తిస్తుంది. అయితే, ముస్లిం మహిళలందరూ హిజాబ్ ధరించరనీ ఆమె అన్నారు. హిజాబ్ ధరించని మహిళల్నికొందరు బెదిరిస్తున్నారని…తనకూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించారనీ గుర్తు చేశారు. అబుదాబినుంచి ఆ కాల్ వచ్చిందని.. హిజాబ్ పై నా అభిప్రాయాన్ని తప్పుబడుతూ దుర్భాషాలాడాడని.. నేను లిప్ స్టిక్ వేయడాన్ని జుట్టు వదిలేయడాన్ని అతను తప్పుబట్టాడని… హిజాబ్ ధరించని మహిళను కాఫిర్ అంటారని తనతో వాగ్వాదానికి దిగాడని ఆమె చెప్పింది.
హిజాబ్ విషయంగా పడుతున్న ఈ అఢుగు ఇస్లామిక్ స్టేట్ వైపే అని గ్రహించాలని…ముస్లిం యువత మేల్కొనాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బురఖాలో కూర్చోవాలనుకునేవారికి రేపు నీ చదువు సమస్య వస్తుందని..సిరియా, పాకిస్తాన్లో ఏం జరుగుతుందో చూడండనీ ఆమె హితవు పలికారు. వేర్పాటువాదం వైపు యువత వెళ్తోందని..తరువాత వారిని తీవ్రవాదులుగా మార్చే శక్తులు రంగంలోకి దిగుతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లాంలోకి మార్చితే స్వర్గం వస్తుందని ప్రచారం చేస్తారు. కానీ ఖురాన్ నుంచి ఉగ్రవాదం రాలేదు. వేర్పాటు వాదంనుంచే ఉగ్రవాదం వచ్చిందని దయచేసి అందరూ గ్రహించాలని ఆమె అన్నారు.
ఇవాళ హిజాబ్ కు అనుమతి అడుగుతున్నాం. రేపు బాలబాలికలకు ప్రత్యేక తరగతులు కోరుతాం, ఆ తరువాత ఆదివారం కాదు శుక్రవారం సెలవు కావాలని కోరుతాం. ఇవీ వేర్పాటువాదుల డిమాండ్లు అవుతాయి. నేనేం హిజాబ్ కు, ఖురాన్ కు, ఇస్లాంకు వ్యతిరేకం కాదు..కేవలం వేర్పాటు వాదానికే వ్యతిరేకం అని ఆమె వివరణ ఇచ్చారు.
హలాల్ గురించీ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు మాంసాన్ని మాత్రమే హలాల్ చేసేవారు. కానీ క్రమంగా పిండి, బియ్యం , జుట్టు, ఇతర ఉత్పత్తులకూ హలాల్ సర్టిఫికేషన్ ఇస్తున్న పరిస్థితి. ఒక కంపెనీ హలాల్ సర్టిఫికేట్ పొందినట్లయితే, ఆ ఉత్పత్తిని తయారు చేసే చోట మరో మతానికి చెందిన వ్యక్తికి ఉపాధి ఇవ్వరు. వారు ముస్లింలను మాత్రమే నియమించుకోవాలి. ఇలా సమాంతర ఆర్థిక వ్యవస్థను నడపడం సరికాదు.ఆ డబ్బు ఎక్కడికి వెళ్తున్నదో కూడా అందరికీ తెలుసు. ఉగ్రవాద సంస్థలకు ఇలాగే నిధులు సమకూరుతున్నాయని ఆమె ఆవేదనగా అన్నారు.
భారతదేశం ఇస్లామిక్ రాజ్యం కాదని…ప్రజాస్వామ్య దేశమని…రాజ్యాంగం ప్రకారమే ఇక్కడంతా నడుచుకోవాలని ఆమె అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ విధుల గురించి మాట్లాడుతుంది. వేర్పాటువాదానికి వ్యతిరేకంగా గళం విప్పడం భారతదేశంలోని ప్రతి పౌరుడి బాధ్యతని ఆమె గుర్తు చేశారు.
హిజాబ్ రగడ సందర్భంగా కొందరు మంగళసూత్రాన్ని, హిజాబును పోల్చడాన్ని ఆమె అభ్యంతరపెట్టారు. అసలా పోలికేంటని ప్రశ్నించారు. “వారు తలపై కప్పడం గురించి మాట్లాడినట్లయితే, సిక్కులు కూడా తమ తలని కప్పుకున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అయితే, వారు హిజాబ్ గురించి మాట్లాడుతున్నారు కానీ నిఖాబ్ని నెట్టారు. అలాగే, మంగళసూత్రం ఎవరి గుర్తింపును దాచదు, నిఖాబ్ అలా కాదు. ఫేస్ కవర్ ధరించి ఎవరైనా తమ డోర్ బెల్ మోగిస్తే..వాళ్లెవరో తెలుస్తుందా..అసలు పురుషుడో, మహిళో తెలియకుండా లోనికి అనుమతిద్దామా..అందరూ ముఖ్యంగా ముస్లింలు ఆలోచించాలని ఆమె హితవు పలికారు. మరి ఇంటి విషయంలో అంత శ్రద్ధ చూపే వాళ్లు దేశం గురించి ఎందుకు పట్టించుకోరు, ఆలోచించరు అని ఆమె అన్నారు.
అసలు ఖురాన్లో బుర్ఖా ప్రస్తావనే లేదని సుబుహీ ఖాన్ అన్నారు. ప్రైవేట్ భాగాలను కవర్ చేయాలని మాత్రమే చెబుతారు. కానీ కొందరు చాందసవాదులు మహిళల్ని బురఖా ధరించమని బలవంతం చేస్తున్నారని ఆమె అన్నారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి ఆమె మాట్లాడుతూ యోగీ పాలనలో ముస్లిం మహిళలు సంతోషంగా ఉన్నారన్నారు. ఆయనకే ఓటు వేసి తిరిగి అధికారాన్ని కట్టబెట్టాలని అన్నారు. ముస్లిం మహిళల్ని రెచ్చగొడుతూ విపక్షాలు వివాదాలకు తెరలేపుతున్నారనీ అన్నారు. ముస్లిం మహిళలు గత ప్రభుత్వాలను పోల్చి చూడాలని, ఎవర హయాంలో బాగుందో ఆలోచించి ఓటువేయాలనీ కోరారు.