శ్రీలంకలో అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. అయితే రాజీనామాకు సిద్ధమని అధ్యక్షుడు, ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో ఓ పరిష్కారం కనిపించే అవకాశాలున్నాయి. విపక్షాలన్నీ కలిసి నూతన మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ముందుకువస్తున్నాయి.దీనిపై ఆదివారమే అఖిలపక్ష భేటీ జరిగిన సంగతి తెలిసిందే. నూతన మధ్యంతర ప్రభుత్వంలో అన్ని పార్టీల ప్రతినిధులూ ఉంటారు. కొన్నాళ్లపాటు మధ్యంతర ప్రభుత్వం కొనసాగాక పార్లమెంటరీ ఎన్నికలకు వెళ్లాలని ప్రధాన ప్రతిపక్షమైన ఎస్జేబీ సూచించింది.
మరోవైపు విక్రమసింఘే కార్యాలయంలో ఉదయం కేబినెట్ భేటీ జరిగింది. అఖిలపక్షంతో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు కాగానే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తామని మంత్రులు సంయుక్తంగా ప్రకటించారు.
కుటుంబపాలన, కరోనాప్రభావం, పాలకుల అనాలోచిత ధోరణి, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, విపరీతంగా విదేశీ రుణాలు ఇలా ఎన్నోకారణాలకో శ్రీలంక ఆహార, ఆర్థికసంక్షోభంలోకి వెళ్లిపోయింది. శ్రీలంకకు ఏటా పర్యాటక రంగం నుంచి 360 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరితే, కరోనా కారణంగా ఇది 60 కోట్ల డాలర్లకు పడిపోయింది. పర్యాటక రంగంపై ఆధారపడిన దాదాపు 30 లక్షలమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. రాజపక్స సోదరుల బంధుప్రీతి, అవినీతికి పాల్పడటం ప్రధాన కారణాలు అని చెప్పవచ్చు. అధికారంలోకి రావడంకోసం ప్రజాకర్షక పథకాలు, ఉచితపథకాలు ఇవ్వడంవల్ల దేశ ఆర్థికవ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. అవసరాలు తీర్చుకోవడం కోసం కరెన్సీని 42 శాతం అధికంగా ముద్రించడం, ఫలితంగా దేశంలో ద్రవ్యోల్బణం 15 శాతానికి మించడం వంటి వరుస ఉపద్రవాలు ఆ చిన్న దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి.
చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎరువుల నాణ్యత సరిగా లేకపోవడం, ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకునేందుకు సరిపడా విదేశీ మారకద్రవ్యమైన డాలర్లు లేకపోవడంతో వందశాతం సేంద్రీయసేద్యంవైపు అడుగులు వేయడం కూడా ఈ పరిస్థితి కారణం. అది సత్ఫలితాలివ్వక తిండిగింజలకూ ఇబ్బంది అయింది. ప్రపంచ దేశాల అప్పులు పెరిగిపోయాయి. నిత్యావసరాల ధరలూ ఆకాశాన్నంటాయి. రోజుకు 15 గంటల కరవు కోతలు జనాన్ని ఇబ్బందిపెట్టాయి.
శ్రీలంకలో ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు కేవలం 150 కోట్ల డాలర్లు మాత్రమే ఉన్నాయి. అప్పులకు ఎగబడడంతో చాలా నష్టపోయింది. కేవలం చైనా నుంచి 350 కోట్ల డాలర్ల అప్పు తీసుకున్న శ్రీలంక వాటిని తిరిగి చెల్లించలేక దేశంలోని కొన్ని ఆస్తులను అమ్మే పరిస్థితికొచ్చింది. శ్రీలంకలోని హంబన్ టోట పోర్టును 99 సంవత్సరాలకు 75 శాతం కంట్రోల్ని చైనా తీసుకుంది. ఇలా సొంతదేశంలోని ఆస్తుల్నీ అమ్ముకునే స్థితికి చేరుకుంది.
అటు శ్రీలంక సంక్షోభం నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఆ దేశ జలాల వెంబడి నిఘా పెంచింది. అక్రమ వలసదారులను నియంత్రించేందుకు సముద్రంలో అదనపు హోవర్క్రాఫ్ట్లు, పెట్రోలింగ్ బోట్లను మోహరించారు. కోస్టల్ పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.