చైనాయే ఆదర్శం: అల్లరిమూకలపై ఉక్కుపాదం
దేశానికి ఇది మంచి అనుకున్నప్పుడు ఎందరు గగ్గోలు పెట్టినా, ప్రపంచంలో ఎన్ని దేశాల అధినేతలు విమర్శించినా పట్టించుకోక పోవడం చైనా పాలకుల విధానం. ఇప్పుడు భారతదేశంలో ప్రభుత్వం కూడా ఇదే చేయాలి. రైతును రాజును చేయడానికి తెచ్చిన చట్టాలను రద్దు చేయాలంటూ రైతుల పేరుతో ఆందోళన జరగుతున్నది. అందులో రైతుల కంటే వేరేవాళ్లకే ఎక్కువగా ఉన్నారు. దీని వెనుక రాజకీయ కుట్ర కోణం, ఖలిస్తానీ ఉగ్రవాదుల ప్రోత్సాహం స్పస్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని అంతర్జాతీయ అంశంగా చేయడానికి మో ధలీవాల్, జగ్మీత్ సింగ్ వంటి ఖలిస్తానీ బాస్ లు కెనడా కేంద్రంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మాత్రానికే ఎవరూ బెదిరిపోనవసరం లేదు.
చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన యధేచ్ఛగా జరుగుతున్నా మన దేశంలోని కమ్యూనిస్టు నాయకులు ఆ దేశాన్ని పొగుడుతుంటారు. భారతదేశం అమెరికాతో దోస్తీ చేయవద్దు. చైనాతో చెలిమి చేయాలంటారు. చైనాను ఫాలో కావాలంటారు. అది లక్షర సత్యం. మన ప్రభుత్వం చైనాను ఫాలో కావాలి. నిరసన పేరుతో హైవేలను ఆక్రమించడం, సెల్ టవర్లను కూల్చడం, ఎర్రకోట మీద జాతీయ పతాకాన్ని అవమానించడం వంటి జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడిన వాళ్లను, ప్రోత్సహించిన వాళ్లను వదల వద్దు. కఠినంగా శిక్షపడేలా చేయాలి. ఈ ఒక్క విషయంలో మాత్రం డ్రాగన్ చైనాయే మనకు ఆదర్శం.