సారుకు స్టార్టింగ్ ట్రబులా!!!
ఉద్యమనేతకూ, ప్రభుత్వ సారథికీ ఎంత తేడా? పదమూడేండ్ల ఉద్యమ కాలంనాటి కెసిఆర్ వేరు. ఆరున్నర ఏండ్ల ముఖ్యమంత్రి కెసిఆర్ వేరు కావచ్చు అనిపిస్తే అది మన తప్పు కాదు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విపరీతమైన తాత్సారం జరుగుతోంది. ఇందుకు కారణం ఏందో సీఎం సారే చెప్పాలి.
ఇక, కొన్ని ముఖ్యమైన అధికారిక నిర్ణయాలను తీసుకోవడంలో తెగ జాప్యం జరుగుతున్నది. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పుడో తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ తీసుకోకుండా జాప్యం చేయడానికి కారణం ఏమిటో తెలియదు. ఉదాహరణకు. ఆయుష్మాన్ భారత్ అనేది మోడీ ప్రభుత్వం తెచ్చిన అద్భుతమైన ఆరోగ్య పథకం. పేదలకు ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ప్రయివేటు ఆస్పత్రుల్లో కూడ ఉచితంగా వైద్యం చేయించుకునే పథకం. కరోనా చికిత్సకు కూడా మోడీ అవకాశం కల్పించారు. కానీ కల్వకుంట్ల దొరగారు ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చలేదు. కనీసం ఆయుష్మాన్ భారత్ కు అడ్డంపెట్టిన కాలు తొలగించలేదు. ఎంతో మంది కరోనాకు బలైన తర్వాత, తాపీగా ఈ మధ్య ఆయుష్మాన్ భారత్ కు సై అన్నారు.
నాన్ రిజర్వుడు, లేదా అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు మోడీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చి రెండేండ్లు అయింది. తెలంగాణలో అమలు కావడం లేదు. కెసిఆర్ సారు అడ్డం పడ్డారు. ఇప్పుడు ఆ అడ్డం పెట్టిన కాలు పక్కకు జరిపి, నేను సైతం అంటున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి రెండేండ్లు ఆలోచించారా? ఒక ఆలోచనను ఆచరణలోకి తేవడానికి సారుకు ఇంత సమయం పడుతుందా? స్టార్ట్ కాకుండా సతాయించే వాహనాలను తోయాల్సి వస్తుంది. సారు ఆలోచన కూడా స్టార్ట్ ట్రబుల్ ఎదుర్కొంటున్నదా? ఏమో. ఆయనే చెప్పాలి. ఇంకా చాలా విషయాల్లో సీఎం ఆలోచనలు కొలిక్కి రాలేదు. ఆ మధ్య ఆర్టీసీ సమ్మె కాలంలో నో అన్న వాటన్నింటికీ (దాదాపుగా) ఆ తర్వాత సారు యెస్ అన్నారు. అన్ని రోజుల సమ్మె విరమిస్తాం మొర్రో అని కార్మకులు చెప్తున్నా సరే అనడానికి కూడా సారుకు సమయం పట్టింది. మనసులోని ఆలోచన ఓ కొలిక్కి రావడానికి సమయం పడుతుందేమో. అయితే ఒక్క మాట. ఆలస్యమైనా సహేతుకమైన, ప్రజలకు ప్రయోజనకరమైన నిర్ణయాలు తీసుకుంటే అదే పదివేలు.