తమిళనాడుకు చెందిన విద్యావేత్త నెల్లై కన్నన్ ను..కామరాజర్ కతిర్ అవార్డుతో సత్కరించారు. సీఎం ఎంకే స్టాలిన్ సమక్షంలో ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంటాడు కన్నన్. అమిత్ షాను హత్య చేయాలని ఇస్లామిస్టులను రెచ్చగొట్టినందుకు గతంలో ఆయన్ని అరెస్ట్ చేశారు.
ఇక ఇదే వేదిక నుంచి అంబేద్కర్ సుదర్ 2021 పురస్కారాన్ని సీఎం స్టాలిన్ అందుకున్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథి కూడా స్టాలినే. ఈ సందర్భంగా స్టాలిన్ ను ప్రశంసల్లో ముంచెత్తారు కన్నన్.. స్టాలిన్ కేవలం తమిళనాడుకే కాదు దేశానికే ఓ విజన్ ను అందిస్తున్న నాయకుడని కొనియాడారు.
తరుచూ వివాదాస్పద, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే కన్నన్ కు ఈ పురస్కారం ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అమిత్ షాను చంపేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ నెటిజన్లూ ట్రోల్ చేస్తున్నారు. ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసినందుకు దేశంలోని ముస్లింలంతా అమిత్ షాను చంపుతారని నేను ఆశించాను’ అంటూ..రెండేళ్ల క్రితం అంటే 2019 డిసెంబర్ 29న జరిగిన ఇస్లామిస్ట్ సంస్థ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా SDPI సమావేశం సాక్షిగా ముస్లింలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారు కన్నన్. ఇంతవరకూ ఏ ముస్లిం కూడా షాను చంపలేదని.. బాధగా ఉందని అన్నారు కన్నన్.
ప్రధానిని వెనకుండి నడిపిస్తున్నది అమిత్ షా అని… ఆయన కథను పూర్తి చేస్తే…ప్రధాని పరుగూ ఆగుతుందని నెల్లై కన్నన్ అన్నారు. “అతని కథ పూర్తయితే, ప్రధానమంత్రి కథ కూడా ముగిసేది. నేను ఏదో జరుగుతుందని ఊహించా…కానీ ముస్లింలెవరూ ఆ పని చేయడం లేదు’ అని బాహాటంగా వ్యాఖ్యానించారు.
ఎప్పుడూ ఏవో వివాదాస్పద వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కన్నన్ కు అలవాటే.. గతంలో ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం పైనా ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కన్నన్ మీద 15కు పైగా కేసులు నమోదయ్యాయి.