పాకిస్తాన్ లో ఘోరం జరిగింది. దైవదూషణ చేశాడనే నెపంతో శ్రీలంకకు చెందిన వ్యక్తిని చంపి బహిరంగంగా సజీవదహనం చేశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపింది. పంజాబ్ ప్రావిన్స్ లోని సియాల్ కోట్ లో ఈ దారుణం వెలుగుచూసింది. శ్రీలంకకు చెందిన శ్రీలంక జాతీయుడైన ప్రియాంత కుమార…వజీరాబాద్ రోడ్డులోని ఓ పరిశ్రమలో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. తెహ్రీక్ ఇ లబ్బాయిక్ పాకిస్థాన్ (టీఎల్ పీ) కి చెందిన కరపత్రాలను చింపేయడమే హత్యకు కారణమని తెలుస్తోంది. చిన్న గొడవగా మొదలై సజీవ దహనానికి దారితీసినట్టు చెబుతున్నారు. ఒక్కసారిగా చుట్టుముట్టిన వందలాది మంది కార్మికులు విచక్షణా రహితంగా కొడుతూ నడిరోడ్డుపైకి తీసుకువచ్చి సజీవదహనం చేశారు. దైవదూషణలు చేశాడని..అతడిని శిక్షించాలంటూ…అక్కడున్న వారు నినాదాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ విషాదకరమైన ఘటనపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పంజాబ్ సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై హక్కుల సంస్థ ఆమ్నేస్టీ ఇంటర్నేషనల్ దక్షిణాసియా విభాగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
అటు తమ జాతీయుడిని కొట్టి చంపిన ఘటనను శ్రీలంక దేశం తీవ్రంగా ఖండించింది. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది శ్రీలంక పార్లమెంట్. ఆ దేశంలోని మిగిలిన శ్రీలంక పౌరులు, కార్మికులకు భద్రత కల్పించాలని అధికారులను కోరింది.

File Photo