5.4 బిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి ఆపదలో ఆదుకున్నందుకు ప్రతిగా శ్రీలంక భారత్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది.
మొదటి బహుమతి చైనా కి చెందిన నిఘా నౌక యువాన్ వాంగ్ 5 ని శ్రీలంకలోని చైనా అధీనంలో ఉన్న హంబన్ తోట పోర్ట్ లో లంగర్ వేయడానికి శ్రీలంక ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే Spy Ship Yuvan Wang 5 ని శ్రీలంక లోని హంబన్ తోట పోర్ట్ లో నిలిపిఉంచడానికి అనుమతి ఇవ్వవద్దు అంటూ భారత్ చేసిన విజ్ఞప్తిని మొదట మన్నించిన శ్రీలంక ప్రభుత్వం దీని మీద చైనాకి అనుమతి ఇవ్వలేదు కానీ లోపల లోపల ఏం జరిగిందో కానీ చైనా ఒత్తిడికి తలవొంచిన శ్రీలంక పభూత్వపెద్దలు చివరికి హంబన్ తోట పోర్ట్ లో లంగర్ వేయడానికి చైనాకి అనుమతి ఇచ్చింది.
Spy Ship Yuvan Wang 5 నిఘా నౌక శ్రీలంకలోని హంబన్ తోట పోర్ట్ లో ఉంటే భారత్ కి వచ్చిన నష్టం ఏమిటి ?
1. నిఘా నౌక యువాన్ వాంగ్ 5 అనేది బహుళ ప్రయోజనం ఉన్న నిఘా నౌక. దానికి అంతరిక్షం, ఉపగ్రహాల మీద నిఘా ఉంచగల సామర్ధ్యం ఉంది. సముద్రంలో ఉంటూనే అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాల కదలికల మీద నిఘా పెట్టగల సామర్ధ్యం యువాన్ వాంగ్ 5 కి ఉంది.
2. ఖండాంతర క్షిపణుల [Inter Continental Ballistic Missiles – ICBM] లని ప్రయోగ దశ నుంచి అవి ఏ మార్గంలో ప్రయాణిస్తున్నాయో పసిగట్టి వాటిని ట్రాక్ చేసే సామర్ధ్యం ఉంది. బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైళ్ళ తో పాటు రాకెట్ లాంచింగ్ ని కూడా ట్రాక్ చేయగలదు.
3. కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లలోని రాకెట్, మిస్సైల్ లాంచింగ్ లని పసిగట్టగల సామర్ధ్యం యువాన్ వాంగ్ 5 కి ఉంది. అంటే శ్రీలంకలోని హంబన్ తోట పోర్ట్ లో ఉంటూ అటు కేరళ తో పాటు ఇటు తమిళనాడు లో కూడా నిఘా వేయగల సామర్ధ్యం యువాన్ వాంగ్ 5 కి ఉంది. భారత్ అభ్యంతరం చెప్తున్నది దీని కోసమే.
4. యువాన్ వాంగ్ 5 అనేది ఆ సీరీస్ నిఘా నౌకాలలో మూడవ తరంకి చెందిన అత్యాధునిక నిఘా నౌక. 2007 సెప్టెంబర్ 29న జల ప్రవేశం చేసినప్పటి నుంచి వరుసగా అప్గ్రేడ్ చేస్తూ వచ్చింది చైనా. అత్యాధునిక ఎలెక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ వలన సుదూర ప్రాంతాల నుంచి వచ్చే శబ్దాలని విని వాటిని అనలైజ్ చేయగల సామర్ధ్యం యువాన్ వాంగ్ 5 కి ఉంది.
5. చైనాలోని 708 రీసర్చ్ ఇన్స్టిట్యూట్ లో అభివృద్ధి చేసిన యువాన్ వాంగ్ 5 నిఘా నౌక ప్రధానంగా అంతరిక్షం, ఊగగ్రహాల మీద నిఘా ఉంచడానికి ఉద్దేశించి తయారుచేశారు కానీ తరువాతి కాలంలో బాలిస్టిక్ మిసైల్ లాంచింగ్ మీద వాటిని ట్రాక్ చేయడం మీద కూడా నిఘా పెట్టగల అత్యాధునిక ఇన్స్ట్రుమెంటేషన్ ని కూడా అమర్చారు.
6. తైవాన్ ప్రాదేశిక జలాలలో ప్రస్తుతం చైనా నిర్వహిస్తున్న లైవ్ ఫైర్ డ్రిల్ వలన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా తైవాన్ కూడా తన డిఫెన్స్ నౌకా దళాన్ని చైనా యుద్ధ నౌకలకి కంటి చూపు దూరంలో ఎదురు ఎదురుగా మోహరించింది. ఈ నేపథ్యంలో అటు అమెరికా కానీ ఇటు భారత్ కానీ హిందూ మహా సముద్రంలో బాలిస్టిక్ మిసైల్ దాడి చేయవచ్చు అన్న అనుమానం చైనాది. కానీ ఈ పని చేసే ముందు అమెరికా కానీ భారత్ కానీ అంతరిక్షంలో ఉన్న చైనా మిలటరీ ఉపగ్రహాలని ముందు నాశనం చేసి తరువాత నేరుగా యుద్ధానికి దిగవచ్చు అనే భయం చైనాది. ప్రస్తుతం యుద్ధ వ్యూహాలలో మొదటి దశగా అంతరిక్షంలోని ఉపగ్రహ వ్యవస్థని ముందు నాశనం చేసి ఆ వెంటనే యుద్ధం ప్రారంభించడం అనేది ముఖ్యమైన అంశంగా పరిగణిస్తున్నారు.
7. ఆగస్ట్ 11 నుంచి 17 వ తారీఖు వరకు హంబన్ తోట పోర్ట్ లో యువాన్ వాంగ్ 5 ని నిలిపి ఉంచడానికి అనుమతి తీసుకుంది చైనా శ్రీలంక నుంచి. అయితే మొదట భారత్ అభ్యంతరాలని పరిగణలోకి తీసుకున్న ద్వీప దేశం మొదట అనుమతి నిరాకరించినా చైనా ఒత్తిడి వలన ప్రస్తుతం ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని శ్రీలంక చైనా ఒత్తిడికి తల వంచింది.
8. అయితే చైనా భయం వేరే విధంగా ఉంది. భారత్, అమెరికా ల మధ్య గతంలో క్వాడ్ ఒప్పందంలో భాగంగా అమెరికన్ నావీ కి చెందిన వివిధ యుద్ధ నౌకాలకి రిపేర్, నిర్వహణ బాధ్యతలు భారత్ కి చెందిన L&T కి కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం అమెరికన్ నావీ కి చెందిన కార్గో షిప్ USNS CHARLES మరమ్మత్తుల కోసం తమిళనాడులోని కట్టుపల్లి నౌకా కేంద్రానికి చేరుకుంది. అది అమెరికన్ నావీ కి చెందిన కార్గో షిప్ కాబట్టి ఏమైనా మిసైల్స్ ని కట్టుపల్లి నౌకా కేంద్రంలో ఆన్ లోడ్ చేయడానికి వచ్చిందేమో అని చైనా భయం.
9. ఆగస్ట్ 11 నుంచి 17 వరకు హంబన్ తోట పోర్ట్ లో తిష్ట వేయబోతున్న చైనాకి చెందిన నిఘా నౌక యువాన్ వాంగ్ 5 కోసం ఇంధనం, ఇతర అవసరాల కోసం ఏర్పాటు చేయవలసిందిగా చైనా శ్రీలంకని కోరింది కానీ తమ దేశ పౌరులకి పెట్రోల్, డీజిల్ ని ఇవ్వలేకపోతున్న శ్రీలంక చైనా నిఘా నౌకకి ఇంధనం ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తుంది ? కనీసం ప్రయాణీకుల విమానాలకి అవసరం అయ్యే జెట్ ఇంధనం ని కూడా సరఫరా చేసే స్థితిలో లేని శ్రీలంక తమ దేశానికి వచ్చే పాసింజర్ విమానాలని ముందుగానే ఇంధనం నింపుకొని తమ దేశానికి రావలసిందిగా కోరుతున్నది అలాంటిది చైనా నౌకకి ఇంధనం ఎక్కడ నుంచి ఇవ్వగలదు ? ఈ ప్రశ్నకి జవాబు దొరకడం లేదు.
శ్రీలంక – పాకిస్థాన్ !
చైనాలోని షాంఘై లో తయారైన పాకిస్థాన్ కి చెందిన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ ‘PNS తైమూర్ ‘ అన్ని లాంఛనాలు ముగించుకొని షాంఘై నుంచి కరాచీ పోర్ట్ కి వెళుతూ మధ్యలో కాంబోడియా, మలేషియా పోర్ట్ లలో ఆగి అక్కడి నుంచి కరాచీ వెళ్ళే ప్రయాణంలో ‘పోర్ట్ ఆఫ్ కాల్ ‘ [పోర్ట్ ఆఫ్ కాల్ అంటే ఏదన్నా యుద్ధ నౌక తన ప్రయాణంలో భాగంగా వేరే దేశ పోర్ట్ లోకి రావడానికి 15 రోజుల ముందు అక్కడి పోర్ట్ అనుమతి కొరడాన్ని పోర్ట్ ఆఫ్ కాల్ అంటారు. సాధారణంగా యుద్ధ నౌకాలకి ఆయా దేశాలు అనుమతి ఇవ్వవు కానీ కొద్ది సందర్భాలలో అనుమతి ఇస్తాయి. శ్రీలంకలోని కొలంబో పోర్ట్ అనుమతి కోరింది పాకిస్థాన్. పాకిస్థాన్ అడిగిందే తడవుగా శ్రీలంక PNS తైమూర్ కి అనుమతి ఇచ్చింది కొలంబో పోర్ట్ లో ఆగడానికి.
ఆగస్ట్ 12 నుంచి 15 వరకు కొలంబో పోర్ట్ లో లంగర్ వేస్తుంది PNS తైమూర్. అయితే PNS తైమూర్ fully loaded అవునా కాదా అన్నది తెలియరాలేదు కానీ రాడార్ వ్యవస్థ మాత్రం యాక్టివ్ గా ఉంటుంది ఇక గైడెడ్ మిసైళ్లు ఉండకపోవచ్చు తైమూర్ లో.
శ్రీలంకలోని కొలంబో పోర్ట్ లో పాకిస్థాన్ కి చెందిన చైనా తయారీ గైడెడ్ మిసైల్ PNS తైమూర్ ఆగస్ట్ 12 నుంచి 15 వరకు ఉంటుంది అదే సమయంలో శ్రీలంక లోని హంబన్ తోట పోర్ట్ లో ఆగస్ట్ 11 నుంచి 17 వరకు చైనా నిఘా నౌక యువాన్ వాంగ్ 5 లంగరు వేసి ఉంటుంది.
ఆగస్ట్ 15 మన దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే సమయంలో ద్వీప దేశంలో రెండు శత్రు దేశపు యుద్ధ నౌకలు మన మీద నిఘా వేసి ఉంటాయి అన్నమాట. మనం చేసిన సహాయానికి ప్రతిగా శ్రీలంక ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ లు ఈ రెండూ అన్నమాట. బంగ్లాదేశ్ లోని పోర్ట్ లో కూడా ఆగడానికి పాకిస్థాన్ అనుమతి కోరింది కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
~ పార్ధసారధి పోట్లూరి