…………
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రెండో సర్ సంఘ్ ఛాలక్ అయిన శ్రీ గురూజీ యోజన అద్బుతం అని వక్తలు అభిప్రాయ పడ్డారు. ఆయన దార్శనికత తోనే సంఘ్ విస్తరణ వికసించింది అని వివరించారు. “శ్రీగురూజీ సమగ్ర గ్రంథావళి” అనే సిద్ధాంత సంబంధ సంకలనాన్ని తెలుగు పాఠకుల కోసం ‘శ్రీ గురూజీ దృష్టి – దార్శనికత’ పేరుతో అనువదించడం జరిగింది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ పుస్తకం విడుదలైంది. ఇంతకు ముందు హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రచురితమైన ఈ గ్రంథాన్ని, ప్రముఖ సీనియర్ పాత్రికేయులు వేదుల నరసింహం తెలుగులో అనువదించారు. ఈ పుస్తకం, శ్రీ గురూజీ గోల్వాల్కర్ యొక్క ఆలోచనలు, సిద్ధాంతాలను తెలుగు పాఠకులకు చేరువ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
నవయుగ భారతి ఆధ్వర్యంలో ‘శ్రీ గురూజీ దృష్టి – దార్శనికత’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం పటేల్ హాల్, కేశవ మెమోరియల్ విద్యా సంస్థలు, నారాయణగూడ, హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ మేధావులు, విద్యావేత్తలు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్ఎస్ఎస్) సభ్యులు సుమారు 400 మంది వరకూ హాజరయ్యారు. ఈ సందర్భంలో “గోల్వాల్కర్: ది మోడ్రన్ ఋషి విత్ ఎ మిలేనియల్ విజన్” అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. శ్రీ ఎస్. గురుమూర్తి రచించిన ఈ గ్రంథాన్ని సంవిత్ ప్రకాశన్ ప్రచురించింది.
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా హాజరైన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య వెల్దండ నిత్యానందరావు ఈ పుస్తకాన్ని తెలుగులోకి తీసుకురావడంలో నవయుగభారతి చేసిన కృషిని ప్రశంసించారు. “ఇలాంటి లోతైన ఆలోచనలు భాషా పరిమితులను దాటి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈ గ్రంథం పరిశోధకులకు, యువతకు, శ్రీ గురూజీ అభిప్రాయాలను అర్థం చేసుకునే గొప్ప మార్గదర్శకంగా నిలుస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
పుస్తకాన్ని అనువదించిన సీనియర్ జర్నలిస్ట్ శ్రీ వేదుల వేదుల నరసింహం మాట్లాడుతూ గురూజీ ఓ తపస్వి అని, రుషితుల్యులని అభివర్ణించారు. సామాన్య కార్యకర్త మొదలు మేధావులకు, ధర్మాచార్యులకు కూడా మార్గదర్శనం చేయగల మేధో సంపన్నుడు అని అన్నారు. డాక్టర్జీ సంఘ్ని ప్రారంభించి, హిందూ రాష్ట్ర వాదానికి ప్రాచుర్యం కలిపిస్తే.. దానికి తాత్వికతను, సైద్ధాంతపరమైన భూమికను గురూజీ అందజేశారని అన్నారు. ఆయన సరసంఘచాలక్గా వున్న సమయంలో దేశవ్యాప్తంగా పర్యటించారన్నారు. 1972లో హైదరాబాద్లోనే శిక్షావర్గ జరిగిందని, తమకు వారి ప్రత్యక్ష మార్గదర్శనం పొందే అదృష్టం కలిగిందన్నారు.
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ శ్రీ సునీల్ అంబేకర్ మాట్లాడుతూ శ్రీ గురూజీ జాతీయ ఏకతా, నిస్వార్థ సేవ, సిద్ధాంతాలను వివరిస్తూ ప్రసంగించారు. “శ్రీ గురూజీ యొక్క తత్వశాస్త్రం నేటికీ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆయన మార్గదర్శనం ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంత చట్రాన్ని నిర్మించడంలో కీలకమైనది. ఈ గ్రంథం ఆయన ఆలోచనలను సమర్థంగా అర్థం చేసుకోవడానికి మార్గదర్శిగా నిలుస్తుంది” అని ఆయన అన్నారు. సునీల్ అంబేకర్ మరిన్ని అంశాలు వారి మాటల్లోనే… శ్రీ గురూజీ జీవితం అనేది త్యాగం, దార్శనికత కలిగిన కథ. చిన్న వయస్సులోనే ఆయన సర్సంఘ్చాలక్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ రోజుల్లో హిందూ గుర్తింపును గురించి మాట్లాడటం సులభమైనది కాదు. మన దేశం విదేశీ పాలనలో ఉన్న సమయంలో ‘హిందూ’ అనే పదాన్ని బహిరంగంగా వాడటం చాలా సవాల్గా మారింది. మదన్ మోహన్ మాలవ్య గారు కూడా ‘హిందూ’ అనే పదాన్ని వివిధ ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి వచ్చేది. ఆ రోజుల్లో జాతీయత అంటే హిందూ, ముస్లింల గురించి మాట్లాడినప్పుడే గుర్తింపు ఉండేది. అలాంటి సమయంలోనే గురూజీ “ఇది హిందూ రాష్ట్రమే” అని ధైర్యంగా ప్రకటించారు.
ఆ సమయంలో ‘సోషలిజం’ అనే మాట ప్రజాసేవలో రాణించాలనుకునే వారిలో ప్రాచుర్యం పొందింది. కానీ, గురూజీ మాత్రం హిందూ గుర్తింపును స్పష్టంగా పేర్కొన్నారు. చికాగోలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం హిందూ పునరుజ్జీవనానికి దారితీసింది. ఆసందర్భంగా “మనం ఎవరు?” “మన జాతీయ గుర్తింపు ఏమిటి?” అన్న చర్చలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లోనే సంఘం స్థాపించబడింది. డాక్టర్ హెడ్గేవార్ గారు తన జీవితాంతం హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లగల వ్యక్తి కోసం అన్వేషించారు. కొంత కాలం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బోధనలో ఉన్న గురూజీని, సంఘం పునాదిని మరింత బలంగా నిర్మించేందుకు డాక్టర్జీ ఎంపిక చేశారు. బహుశా, గురూజీ ఒక తత్వవేత్త, మేధావి, సన్యాసి, ప్రసంగం పరంగా అసాధారణ ప్రతిభ కలిగినవారు కావడం వల్ల ఆయనను ఎంపిక చేయడం జరిగింది. 1940 నుండి 1973 వరకు గురూజీ తన జీవితాన్ని సంఘానికి అంకితమిచ్చారు. దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ, స్వాతంత్ర్యానంతర భారతదేశానికి మార్గదర్శకత్వం వహించారు. విభజన సమయంలో కరాచీలో ఉన్నారు, అక్కడి పరిణామాలను గమనిస్తూ సమీక్షించారు. 1962 నాటికే ఆయన భవిష్యత్తు ప్రమాదాలను ముందుగా ఊహించారు.
అని వివరించారు.
ఈ కార్యక్రమంలో జంట నగరాలకు చెందిన సంఘ్ అభిమానులు, సాహిత్య ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.